
చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: సూపర్ సిక్స్ అని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో మొదటి బాల్కే అవుట్ అయ్యారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశానంటూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే.. హామీలను అమలు చేయకుండానే నెరవేర్చేసినట్టు కూటమి సర్కార్ మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే.. కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయనే విషయాన్ని ఆధారాలు, గణాంకాలతో సహా వివరించారు.
వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని.. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనని చంద్రబాబు బెదిరించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
తల్లికి వందనం మహామోసం
తల్లికి వందనం పథకం ప్రారంభం.. ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలను మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరికలు చేశారు.
ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అదికూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు.
ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. 53.50 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగా అవసరం కాగాజజ కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు.
ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షంగా వాటినే వైఎస్సార్సీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది.
బడ్జెట్, వ్యయాలు.. సంక్షేమ లెక్కలివి
– వైఎస్సార్సీపీ 2023–24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024–25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బడ్జెట్లో ఎక్కువగా పెట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ.52 వేల కోట్లు. పెన్షన్లు రూ.21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా ప్రభుత్వ హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్ రూ.2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయాలను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైఎస్ జగన్ ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం.
– కూటమి ప్రభుత్వంలో జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31 వేల కోట్లు. ఇవన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. ఈ ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. బడ్జెట్లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ.1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది రూ.వెయ్యి పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు.
సంపద సృష్టి అంటే ఇదేనా?
– అప్పులపై చంద్రబాబు ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఏపీకి ఉన్న అప్పు రూ.1,40,717 కోట్లు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే 2019 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. సీఏజీఆర్ ప్రకారం చూస్తే 22.63 శాతం ఎక్కువగా అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే 2024 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.7,21,918 కోట్లు.
అంటే ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.3,32,671 కోట్లు. వైఎస్సార్సీపీ హయాంలో సీఏజీఆర్ 13.5శాతం మాత్రమే. ఇవన్నీ కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు. వీటిని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు. శ్రీలంక, కంబోడియాగా ఏపీని మార్చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేశారు.
– వైఎస్సార్సీపీ పాలనలో 2022–23లో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,57,768 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లు. ఆ రెండేళ్లలో ఆదాయం చూస్తే 10శాతం పెరిగింది. ఆ ఏడాది అప్పులు చూస్తే 19 శాతం మాత్రమే పెరిగాయి. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అప్పులు 30 శాతం పెంచితే.. ఆదాయం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి?. 2024 ఏప్రిల్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,500 కోట్లు అయితే, 2025 ఏప్రిల్లో నాటికి వచ్చిన రాష్ట్ర జీఎస్టీ రూ.2,652 కోట్లు. అంటే.. 24 శాతం తక్కువగా వచ్చింది.
గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం 2024లో రూ.7,483 కోట్లు కాగా, 2025లో వచ్చిన ఆదాయం రూ.6,569 కోట్లు. అంటే 12 శాతం ఆదాయం పడిపోయింది. పన్నేతర ఆదాయం ఏప్రిల్ 2024లో రూ.442 కోట్లు అయితే, 2025 ఏప్రిల్ నాటికి రూ.345 కోట్లు. అంటే 22 శాతం తక్కువ. ఏప్రిల్ 2024లో పన్ను, పన్నేతర ఆదాయం కలిపి లెక్కిస్తే రూ.7,925 కోట్లు కాగా, 2025 ఏప్రిల్ నాటికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.6914 కోట్లు. అంటే 12 శాతం తక్కువ.
ఉద్యోగుల సొమ్మును వాడేశారు
ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల అమలు ఏదీ. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.32,997 ఉంది. అందులో ఏపీ భాగం 19,138 కోట్లు. 2014–19 నాటికి రూ.76,516 కోట్లు. అంటే టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రూ.57,378 కోట్ల సొమ్మును అదనంగా వాడుకుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.76,038 కోట్లు. అంటే మేం ఉద్యోగుల సొమ్మును వాడుకోకపోగా రూ.478 కోట్లను మేం తిరిగి జమ చేశాం. కానీ.. ఉద్యోగుల విషయం మా ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు.
ఏడాదిలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకత
ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్కళ్యాణ్ ఈ విషయాలపై ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలబోతుంటే.. ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత వ్యక్తమైందని తేలింది. ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోంది. ఏడాదిలో ఎన్నో అరాచకాలు చేశారు. చివరకు ప్రశ్నించే జర్నలిస్ట్లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు.