
తిరుపతి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిస్తూనే ఉందని విమర్శించారు తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుడ భూమన కరుణాకర్రెడ్డి. తమ నాయకుడు వైఎస్ జగన్.. రూ. 2 లక్షల 80 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకు నేరుగా అందిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు.
ఈరోజు(ఆదివారం, జూన్ 15వ తేదీ) ‘జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని భూమన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు సిఫాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎమ్మెల్యే సునీల్, విజయానందరెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దీనిలో భాగంగా భూమన మాట్లాడుతూ.. 2 కోట్ల 7 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 1500 ఇవ్వకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన వ్యక్తి.. ఈ రోజు మోసం చేసిన విషయం కళ్లకు కనపడుతోందన్నారు. 30 లక్షల మంది తల్లులకు తల్లికి వందనం మోసం. రైతులకు రూ. 20 వేలు ఇస్తామని మోసం. తల్లికి వందనపై ప్రశ్నించే వాళ్లకు బెదిరింపులు. ఈ ఏడాది మొత్తం మోసాలు చేశాడు.. ఒక అభూత కల్పనతో మోసగించాడు. వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయించి కేసులు పెట్టి జైల్లో పెట్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని భూమన ధ్వజమెత్తారు.