బాబూ.. ఇది టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టే: అంబటి రాంబాబు | YSRCP AMbati Rambabu Serious Comments On CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇది టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టే: అంబటి రాంబాబు

Oct 7 2024 4:39 PM | Updated on Oct 7 2024 5:13 PM

YSRCP AMbati Rambabu Serious Comments On CM Chandrababu

సాక్షి, గుంటూరు: అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా?.. చంద్రబాబు ఒక దుర్మార్గమైన సంప్రదాయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అలాగే, కేసులు మాఫీ చేసుకోవడానికేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్‌ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతోందని చెప్పుకొచ్చారు. 

మాజీ మంత్రి అంబటి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంగళ్లులో పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పచ్చ నేతలు దాడులు చేశారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని అబద్ధాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్‌ చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి మీ మీద ఉన్న కేసులన్నీ క్లోజ్‌ చేసుకుంటారా?.

చంద్రబాబు అధికారంలో అన్నీ సిండికేట్లే. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని సిండికేట్‌ చేసింది. ఎల్లో మీడియాను సిండికేట్‌ చేసి వాళ్లకు సంపద సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. నాణ్యమైన మద్యం దొరకడం లేదని చంద్రబాబు ప్రచారం చేశారు. నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో​ రానున్న రోజుల్లో చూస్తాం. మద్యం దుకాణానికి రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. నేడు విచ్చలవిడిగా మద్యం అమ్ముకునేందుకు తలుపులు తెరిచారు. రూ.30లక్షలు కట్టకపోతే షాపులు దక్కనివ్వబోమని బెదిరిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలను మళ్లీ తెరమీదకి తెస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడమే మంచి ప్రభుత్వమా?. సిండికేటుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారు. మద్యం షాపులు నడపాలని ముందుకొచ్చే వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. 961 షాపులకు నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్‌ కూడా రాలేదు. దరఖాస్తులు పెట్టుకోవాలంటే టీడీపీ ఎమ్మెల్యేలకు జనం భయపడుతున్నారు. ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టించే కార్యక్రమం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేశాడు. రాష్ట్రంలో ప్రస్తుతానికి అసలు ఇసుకే దొరకడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో కంటే ఇప్పుడే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. టీడీపీ నేతలే సిండికేట్‌గా ఏర్పడి ఇసుకను దోచేస్తున్నారు’ అంటూ విమర్మించారు. 

ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్‌!: వైఎస్సార్‌సీపీ
 

Advertisement
 
Advertisement
Advertisement