
సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్ జగన్ నిలదీశారు.
ఏం పాపం చేశారని..
వైఎస్సార్సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు.
కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్ వైజాగ్ ల్యాండ్ క్యాన్సిల్ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్కుమార్-కృష్ణవేణిలను వేధించారు. రాజ్కుమార్ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.
సినిమా చూపిస్తాం
వైఎస్సార్సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్ జగన్ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు.
