You All Are Alive Because Of Modi Says Bihar Minister Ram Surat Rai - Sakshi
Sakshi News home page

మీరు ప్రాణాలతో ఉన్నారంటే ప్రధాని మోదీనే కారణం.. పాకిస్థాన్ పరిస్థితి చూడండి..

Jul 31 2022 3:03 PM | Updated on Jul 31 2022 8:43 PM

You All Are Alive Because Of Modi Says Bihar Minster Ram Surat Rai - Sakshi

పట్నా: ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తారు బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్‌ సూరత్ రాయ్. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోదీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి అందరి ప్రాణాలను ప్రధాని కాపాడారని పేర్కొన్నారు. ముజఫర్‌పుర్‌లో శుక్రవారం ఓ ర్యాలీకి హాజరైన  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే చిక్కుకుని ఉంటే, భారత్ మాత్రం వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తోందని  రామ్‌సూరత్ రాయ్ అన్నారు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉందో టీవీలో చూస్తే అర్థమవుతోందన్నారు. భారత్‌ మాత్రం శాంతియుతంగా ఉందని తెలిపారు. కరోనా టీకాల క్రెడిట్ మొత్తం మోదీకే ఇస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

జులై 17నాటికి దేశంలో 200 కోట్ల కరోనా టీకా డోసులు పంపణీ చేశారు. అంతేకాదు 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు దేశంలో ఆదివారం కొత్తగా 19,673 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 39 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,43,676 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 204 కోట్ల 25లక్షల 69వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
చదవండి: ‘ఆ డబ్బులు నావి కావు.. కాలమే సమాధానం చెబుతుంది’

Advertisement
 
Advertisement
Advertisement