Raja Singh: ఆ గ్యాప్‌ కొనసాగుతూనే వచ్చింది.. | Why Raja Singh Quits From BJP Few Details Here | Sakshi
Sakshi News home page

Raja Singh: ఆ గ్యాప్‌ కొనసాగుతూనే వచ్చింది.. పార్టీకి ఇలా దూరం చేసింది!

Jun 30 2025 6:31 PM | Updated on Jun 30 2025 8:47 PM

Wh Raja Singh Quits From BJP Few Details Here

రాజాసింగ్‌.. నిన్న మొన్నటి వరకూ బీజేపీలో  ఓ సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో  రాజాసింగ్‌ కచ్చితంగా ఉంటారు. అయితే పార్టీకి ఉన్నపళంగా రాజీనామా చేశారు రాజాసింగ్‌. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి నామినేషన్‌ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్‌..  ఆపై కొద్ది సేపటికే పార్టీకి గుడ్‌ బై అంటూ ప్రకటించారు. 

‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్‌ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా’ అని రాజాసింగ్‌ ప్రకటించారు. అసలు బీజేపీ అధిష్టానంతో రాజాసింగ్‌కు గ్యాప్‌ ఎలా ఏర్పడింది.. ఎక్కడ ఏర్పడింది అనే అంశాల్లో కొన్నింటిని పరిశీలిస్తే..

ఆనాటి గ్యాప్‌.. కొనసాగుతూనే వచ్చింది..!
రాజాసింగ్‌ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. అది ఒకప్పుడు మాట.  అది క్రమేపీ దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్‌. 2022లో నుపూర్‌ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత, రాజాసింగ్‌ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు. 

ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబట్టినట్లయ్యింది. అధిష్టానాన్ని చాలెంజ్‌ చేసినట్లు ఉండటంతో రాజాసింగ్‌ను వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.  2022 ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసింది.  ఆ తర్వాత 2024 అక్టోబర్‌ 22వ తేదీన రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికింది రాజాసింగ్‌కు. అయితే అప్పట్నుంచి అధిష్టానంతో గ్యాప్‌ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 

2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్‌ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడిచింది. అధిష్టానం రాజాసింగ్‌ను  హైదరాబాద్‌ నుంచి  పోటీ చేయించాలని చూసింది. ఇక్కడ రాజాసింగ్‌ మాత్రం ఎంపీగా విముఖత వ్యక్తం చేసిన కారణంగానే ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారనేది మరో చర్చ. 

సస్పెన్షన్‌ గురైన సందర్భంతో పాటు తరచూ వివాదాలు కూడా రాజాసింగ్‌-అధిష్టానం మద్య గ్యాప్‌కు కారణమైంది. ఇటీవల కాలంలో పార్టీ లైన్‌కు భిన్నంగా రాజాసింగ్‌ వ్యవహరించడంతో  ఆయన్ను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సైతం రాజాసింగ్‌ మద్దతు పలికారు. 

బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను రాజాసింగ్‌ సమర్ధించారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపం తెప్పించాయి. రాజాసింగ్‌ రాజీనామా చేసే క్రమంలో అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఆయన్ను బుజ్జగించే పని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా చూసుకుంటే 2022 నుంచే అధిష్టానంతో రాజాసింగ్‌కు సఖ్యత చెడిపోతూ వచ్చిందని, అదే ఇంతవరకూ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement