
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకి చిప్ దొబ్బిందని, అబ్బా కొడుకులు ఇద్దరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన శనివారం వైఎస్సార్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. బాబు ఈ మధ్య తీవ్రంగా ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారని అన్నారు. ఆయన మానసిక స్థితి బాగుందా లేదా, ప్రతిపక్ష నాయకుడిగా అర్హుడా కాదా అని మెడికల్ బోర్డుతో నిర్ధారించాల్సి ఉందని చెప్పారు.
చేతికి ఒక చిప్ ఉందని, అది ఆయనకు అన్నీ తెలియజేస్తుందని అంటారన్నారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశారన్నారు. ప్లీనరీకి వచ్చే వారంతా అద్దె మనుషులంటున్నారని తెలిపారు. ‘ఆయన వద్ద చిప్ ఉంది గదా? ఎవరు తప్పు చేస్తారో చెబుతుంది కదా? నిజంగా అద్దె మనుషులు అయుంటే అది చెప్పాలి కదా? మెదడులోది దెబ్బ తిని ఉంటే రెండో చిప్ అయినా మెసేజ్ ఆయన కంప్యూటర్కి పంపించి ఉండాలి కదా? చంద్రబాబుకి మతి భ్రమించింది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు’ అని చెప్పారు.
ఆయన కొడుకు పప్పు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదన్నారు. తండ్రీ కొడుకుల తీరుతో టీడీపీ భవిష్యత్తు అంధకారమైందని తెలిపారు. 53 నియోజకవర్గాల్లో టీడీపీ సమన్వయకర్తలు లేరని, టీడీపీ దుస్థితికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదని చెప్పారు.