అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్‌ఎస్‌లో డబుల్‌ జోష్‌

Telangana: TRS Won 5 Municipolities  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఫుల్‌ జోష్‌లో ఉంది. నాగార్జునసాగర్‌ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్‌లో అద్భుతమైన విజయంతో డబుల్‌ సంతోషంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్‌, ఖమ్మం కార్పొఒరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్‌ జోష్‌ వచ్చింది.

  • నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్‌లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్‌ఎస్‌ సంఖ్య పెరగనుంది.
  • రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్‌లలో గెలిచింది.
  • నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్‌ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి.
  • మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. 
  • సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్‌ రావు మ్యాజిక్‌ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సత్తా చాటారు.

కార్పొరేషన్‌ ఫలితాలు

  • గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లను కూడా టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది.
  • టీఆర్‌ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. 
  • ఖమ్మం కార్పొరేషన్‌లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. 45 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు.
     

చదవండి: థియేటర్‌లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్‌ ఫుల్‌’
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top