75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లకు స్పెషలాఫీసర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలు సహా 11 మేయర్, 75 మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేటర్, కౌన్సిలర్ల పదవీ కాలం ఈ నెల 17తో ముగుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. పదవీ కాలం ముగియడానికి ముందే ఆ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గత ఏడాది సెపె్టంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
అయితే.. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల ఏర్పాట్లు వంటివి ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనున్న 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే, పిఠాపురం, జగ్గయ్యపేట మున్సిపాలిటీల స్థాయిని పెంచింది. ప్రస్తుతం గ్రేడ్ –2 స్థాయి మున్సిపాలిటీలుగా ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. కాకినాడ నగర కార్పొరేషన్లో ప్రత్యేకాధికారుల పాలనను ఈ నెల 16 నుంచి మరో 6 నెలల పాటు పొడిగించింది.


