అపర సంజీవని ఆరోగ్యశ్రీకి అప్పుల తిప్పలు
ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు అప్పు తేవాలంటున్న సర్కార్
చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు తెస్తున్న దుష్ట సంప్రదాయం
విలాసాలకు ఎడాపెడా ఖజానా సొమ్ము ఖర్చు
ఆస్పత్రుల బకాయిలను చెల్లించాలంటే అప్పులు తేవాలట..
బాబు అండ్కో విదేశీ పర్యటనలు, ఆడంబరాలు, ఈవెంట్లకు ఖజానా నుంచే రూ. వందల కోట్లు ఖర్చు
ఆరోగ్యశ్రీ చికిత్సలందిస్తున్న ఆస్పత్రులకు రూ. 3 వేల కోట్లకు పైగా బకాయి..
బడ్జెట్లో కేటాయింపులు చూపించినా, అవన్నీ ఉత్తుత్తివేనని తేటతెల్లం..
ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల నిరాకరణ
ఏపీఎస్ఎఫ్సీ ద్వారా రుణానికి యత్నం.. ఆ రుణాన్ని ట్రస్టు చెల్లించేలా బాబు పథకం..
బాబు అసమర్థత వల్ల 1.40 కోట్ల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరం..
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఆయన పుత్రరత్నం, ఇతర వందిమాగధులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల కోసం గంటకు లక్షల్లో ఖర్చు పెట్టడానికి ఖజానాలో నిధుల కొరత ఉండదు. ప్రభుత్వం తరపున వాదించేందుకు పెట్టుకొన్న ప్రత్యేక న్యాయవాదులకు కోట్లలో చెల్లించడానికి కూడా నిధుల కొరత ఉండదు. ఎమ్మెల్యేల ఆటపాటలు, విందులు, వినోదాలు, యోగా డే, విజన్ డాక్యుమెంట్ విడుదల వంటి ఈవెంట్లు.. హంగులు, ఆడంబరాలు, ఆర్భాటాలు, ప్రచారాల కోసం ప్రభుత్వం ఖజానా నుంచి నేరుగా రూ. వందల కోట్లు ప్రజాదనాన్ని ఖర్చు చేయడానికి ఏ కొరతా ఉండదు.
కానీ, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల దగ్గరకొచ్చే సరికి ఖజానా ఖాళీగా కనిపిస్తుంది. వారం వారం వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నా, పేదలకు నయా పైసా ఉపయోగం లేదు. రాష్ట్రంలో 1.40 కోట్లకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన, ఆధునిక వైద్యాన్ని అందించే ఆరోగ్య శ్రీ పథకానికి నిధుల్లేవని బాబు సర్కార్ చేతులెత్తేస్తోంది.
ఆరోగ్య శ్రీ నెట్వెర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడానికి నిధుల్లేవని చెబుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో రూ.3.28 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన బాబు సర్కార్.. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల బకాయిలు తీర్చిన పాపాన పోలేదు. ఆ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాలంటే మరిన్ని అప్పులు చేయాలని చెబుతోంది.
గద్దెనెక్కగానే ఆరోగ్యశ్రీకి గ్రహణం..
2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా ఆరోగ్య శ్రీ పథకానికి నిధులు విదల్చకుండా పేదల ఉసురు తీశారు. 2024లో మళ్లీ చంద్రబాబు గద్దెనెక్కాక ఈసారి ఏకంగా పథకానికే గ్రహణం పట్టించారు. బీమా పథకం ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీని గాలికి వదిలేశారు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయాయి. ఆస్పత్రుల యాజమాన్యాలు బిల్లుల కోసం ఎన్నిసార్లు వేడుకొన్నా స్పందించడంలేదు.
చివరకు ఆస్పత్రులు పలు దఫాలు సమ్మెలోకి వెళ్లాయి. దీంతో వారితో చర్చలు జరిపి, బకాయిలను వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఓటీఎస్కు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవని, బ్యాంకుల నుంచి అప్పు చేస్తామని చెప్పింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి పేదలకు చికిత్స చేసిన ఆసుపత్రులకు నేరుగా ఖజానా నుంచి నిధులు చెల్లింపు జరుగుతోంది. చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేనటు్టగా ఆస్పత్రుల బకాయిలు చెల్లింపు కోసం ఆరోగ్య శ్రీ ట్రస్టును అప్పుల్లోకి నెట్టే దుష్ట సంప్రదాయానికి తెరలేపారు.
కానీ, ఆరోగ్య శ్రీ ట్రస్ట్కు రుణం ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించడంలేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ)కి రుణాలు సమీకరించి, వాటిని ఆస్పత్రులకు మళ్లించాలని యోచిస్తున్నామని చెబుతున్నారు. ఆ రుణాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్టు చెల్లిస్తామంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఆస్పత్రులకు రుణం రూపంలో బకాయి నిధులు మంజూరు చేయడం కోసం ఓ యాప్ను రూపొందిస్తున్నారు.
ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులకు మొత్తం బకాయిలో కొంత మొత్తం రద్దు చేసి, మిగిలినది మంజూరు చేయనున్నారు. పేద, మధ్య తరగతికి ఉపయోగపడే పథకం చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అప్పులు చేయడం బాబు సర్కారు దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తుత్తి కేటాయింపులు
బడ్జెట్లో ఆరోగ్యశ్రీ కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. కానీ, ఆస్పత్రులకు మాత్రం బిల్లులు ఇవ్వదు. అంటే ఈ కేటాయింపులన్నీ ఉత్తుత్తివే అని తేలిపోతోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ ఖర్చుల కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. చివరకు ఆస్పత్రుల యాజమాన్యాలు పథకం సేవలు అందించలేమంటూ బోర్డులు తిప్పేసి, పేద రోగుల నుంచి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నాయి.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ..
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేసింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద కవరయ్యే వ్యాధుల సంఖ్యను 1,059 నుంచి 3,257కు పెంచారు. పథకం పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు బావమరిది నడిపే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సహా నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు పెట్టిన వందల కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వమే చెల్లించింది.
విప్లవాత్మక సంస్కరణలతో వైఎస్ జగన్ 2019–24 మధ్య ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విపత్కర పరిస్థితులోనూ నెట్వర్క్ ఆస్పత్రులకు నేరుగా ఖజానా నుంచే బిల్లులు చెల్లించారు. ఇలా ఐదేళ్లలో రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. అలాగే ఈ పథకం కింద చికిత్స పొందిన రోగులకు విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా నెలకు గరిష్టంగా రూ.5 వేల మేర ఆర్థిక సాయం చేశారు.
ఆసరా రూపంలో పేదలకు రూ.1,465 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏడాదిన్నరలోనే పథకాన్ని వెంటిలేటర్ ఎక్కించారు. బిల్లు చెల్లింపులు నిలిపేసి ఆస్పత్రులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఆసరా సాయాన్ని పూర్తిగా ఎత్తేశారు.


