రూ.3 వేలకోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి | AP Specialty Hospital Association ultimatum to the state government | Sakshi
Sakshi News home page

రూ.3 వేలకోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి

Mar 11 2026 2:18 AM | Updated on Mar 11 2026 2:18 AM

AP Specialty Hospital Association ultimatum to the state government

హెల్త్‌ ప్యాకేజీ రేట్లను రివిజన్‌ చేయాలి  

2007 నాటి రేట్లతో ప్రజలకు ఇప్పుడునాణ్యమైన వైద్య సేవలు అందించలేం  

లేదంటే బీమా ఎంవోయూపై సంతకాలు చేయం 

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ అల్టిమేటం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన రూ.3 వేలకోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశ) ప్రతినిధులు డి­మాండ్‌ చేశారు. ఈ బకాయిల విషయం తేల్చకుండానే బీమా విధానం అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. బకాయిల విషయం తేలిస్తేనే బీమా ఎంవోయూపై సంతకాలు చేస్తామని, లేనిపక్షంలో బీమా అమలుకు సహకరించబోమ­ని తేల్చి చెప్పారు. 

విజయవాడలో మంగళవారం ఆశ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ఆశ అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ చికిత్సల ప్యాకేజీ రేట్లను పెంచకుండా 2007 నాటి రేట్లతో ఏప్రిల్‌ 1 నుంచి బీమా విధానం ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నా­రు. ఈ రేట్లతో ఆస్పత్రులు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించలేవన్నారు. 

ఇప్పటికే ఆరోగ్య­శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా కొత్తగా బీమా విధానంలోకి ప్రభు­త్వం వెళుతుండటాన్ని ఆశ పూర్తిగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. బకాయిల విషయం తేల్చకపోతే బీమా విధానానికి సహకరించబోమని స్పష్టం చేశారు. 

ఓటీఎస్‌లోను మాట మార్చిన ప్రభుత్వం  
గతేడాది బకాయిలు చెల్లించాలని సమ్మెచేస్తే బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఓటీఎస్‌లో భాగంగా తమకు రావాల్సిన నిధుల్లోనే కోత విధిస్తామన్నా.. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని ప్రభుత్వ షరతుకు అంగీకరించామని చెప్పారు. నాడు మొత్తం బకాయిలన్నింటినీ ఓటీఎస్‌ చేస్తామని ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. 

రూ.3 వేలకోట్ల బకాయిలుంటే రూ.వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని, డబ్బు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాల­ని తమలోనే చీలిక తెస్తున్నారన్నారు. సమ్మె సమయంలో జరిపిన చర్చల్లో బీమా విధానం రూపకల్పనలో ఆస్పత్రులకు భాగస్వామ్య­ం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ప్యాకేజీ ధరలు రివిజన్‌ చేయకపోతే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడం సాధ్యం కాదని పదేపదే ప్రభుత్వానికి చెప్పినా పాత ప్యాకేజీలతోనే ముందుకెళుతున్నారన్నారు. 

2007 నుంచి ధరల పెరుగు­దల, ఇతర ఖర్చుల్లో వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అధ్యయనం చేసి ప్యాకేజీ రేట్లు రివిజన్‌ చేయాలని ఆశ హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. దీనిపై 4 వారాల్లో స్పందించాల­ని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని, గడువు ముగిసినా సర్కారు స్పందించలేదని తెలిపారు. చికిత్సల ధరలు పెంచకుండా కొత్త విధానం తెస్తూ.. ఆస్పత్రులు నష్టాల్లోకి వెళ్లకుండా దొంగదారులు వె­దుక్కునేలా చేస్తున్నారని విమర్శించారు. 

ఇప్పుడున్న ప్యాకేజీ ధరలతో ఆస్పత్రుల మనుగడ కూడా కష్టమని, బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చే­యని దుస్థితి నెలకొందని చెప్పారు. ఆశ కోశాధి­కారి డాక్టర్‌ నాగమల్లేశ్వరరావు మాట్లాడు­తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించే లక్ష్యంతోనే ప్యా­కేజీ రివిజన్‌ కోరుతున్నామన్నారు. ప్యాకేజీలతో పా­టు పాత బకాయిల మీద స్పష్టత వచ్చేవరకు ఆశ పరిధిలోని ఆస్పత్రులు కొత్త విధానంలోకి వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆశ ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి అవి­నాశ్, సంయుక్త కోశాధికారి గిరిబాబు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement