breaking news
Nakirekal Municipality
-
అన్ని చోట్ల గుబాళింపు: టీఆర్ఎస్లో డబుల్ జోష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఫుల్ జోష్లో ఉంది. నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికలో గెలిచిన ఆనందంలో ఉండగానే మినీ మున్సిపల్స్లో అద్భుతమైన విజయంతో డబుల్ సంతోషంలో టీఆర్ఎస్ శ్రేణులు మునిగారు. రాష్ట్రంలో జరిగిన ఐదుకు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుని గులాబీ పార్టీ సత్తా చాటింది. ఇక వరంగల్, ఖమ్మం కార్పొఒరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో గులాబీ శ్రేణుల్లో డబుల్ జోష్ వచ్చింది. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. నకిరేకల్లో 20 వార్డులు ఉండగా వాటిలో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, ఇతరులు 6 గెలిచారు. ఆ ఇతరుల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. రేపోమాపో వారు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. దీంతో టీఆర్ఎస్ సంఖ్య పెరగనుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ 7 స్థానాలతో సొంతం చేసుకుంది. 12 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 7 గెలవగా కాంగ్రెస్ 5 డివిజన్లలో గెలిచింది. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉండగా టీఆర్ఎస్ 13 గెలిచి చైర్మన్ పీఠం సొంతం చేసుకుంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ 6, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ భారీగా డివిజన్లు సొంతం చేసుకుంది. మొత్తం 27 డివిజన్లు ఉండగా వాటిలో 23 టీఆర్ఎస్ గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ 2, బీజేపీ 2 డివిజన్లతో సరిపెట్టుకున్నాయి. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తోంది. 43 స్థానాలు ఉన్న సిద్దిపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఏకంగా 36 సొంతం చేసుకుంది. ఒకటి చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలవగా ఇతరులు 5 డివిజన్లలో గెలిచారు. ఇతరులు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించగా కొద్దిలో ఆ అవకాశం మిస్సయ్యింది. సొంత నియోజకవర్గం సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సత్తా చాటారు. కార్పొరేషన్ ఫలితాలు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కూడా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 51 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 10 సొంతం చేసుకోగా, రెండుచోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఖమ్మం కార్పొరేషన్లో 55 డివిజన్లు ఉండగా అత్యధిక డివిజన్లను అధికార పార్టీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 45 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 8 డివిజన్లు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల గెలుపొందారు. చదవండి: థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’ చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
విలీన పంచాయతీలకు ఎన్నికలెప్పుడో?
నకిరేకల్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చి ఏడాది గడిచింది. తదనంతరం విలీన గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వానికి నేటికీ ఆ ఆలోచనే రావడం లేదు. ప్రత్యేక పాలనలో అభివృద్ధి పనులు ముందుకు సాగక, సమస్యలు తీర్చేవారు లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను.. పట్టించుకునే నాథుడే లేడు. ప్రజాప్రతినిధుల పాలనలో తప్ప.. ‘ప్రత్యేక’ పాలనలో సమస్యలకు మోక్షం లభించదని, తక్షణమే విలీన గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నకిరేకల్ మండలంలో ఏడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. మండలంలో అంతటా ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతుండగా ఈ ఏడు గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. వెరసి ప్రభుత్వం నుంచి వచ్చే కోట్లాది రూపాయాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు నేపథ్యంలో తిరిగి విలీన గ్రామాల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది ఆయా గ్రామాల మదిని తొలుస్తున్న ప్రశ్న. మున్సిపాలిటీ ఏర్పాటు, రద్దు ఇలా.. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో మున్సిపాలిటీగా మార్చింది. మండలంలోని చందుపట్ల, నోముల, కడపర్తి, చందంపల్లి, నెల్లిబండ, తాటికల్ గ్రామాలను నకిరేకల్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ నాడు నిర్ణయం తీసుకున్నారు. కాగా గ్రామాల విలీనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని గ్రామ పంచాయతీల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించగా 2013 సెప్టెంబర్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. నకిరేకల్తో పాటు విలీన గ్రామాలను యధావిథిగా పంచాయతీలుగానే కొనసాగించాలని ఆదేశించింది. ప్రత్యేక పాలన నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు కావడంతో హైకో ర్టు ఆదేశాల మేరకు నకిరేకల్తో పాటు మరో ఆరు గ్రామ పంచాయతీలను యధావిధిగా తిరిగి పునరుద్ధరించారు. 2014 ఫిబ్రవరి 4వ తేదీనుంచి ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లాయి. ఈ ఏడు పంచాయతీలకు ఈఓఆర్డీ కమలాకర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిలిచిన అభివృద్ధి నకిరేకల్ పట్టణంతో పాటు వీలీనమైన ఆరు గ్రామాల్లో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.1 కోటి నిధులు మంజూరయ్యాయి. వీటిలో రూ. 70 లక్షలు నకిరేకల్ పట్టణానికి, మిగతా రూ. 30 లక్షలు విలీనమైన గ్రామాలకు కేటాయించారు. ఇట్టి నిధులుతో డ్రెయినేజీలు, సీసీరోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సింది ఉంది. ఇందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ, నిర్మాణం పనులు మాత్రం ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవు. మరో వైపు 13వ ఆర్థిక సంఘం, ఇతర పథకాల నుంచి అభివృద్ధి పనుల కోసం నిధులు వచ్చి చేరుతున్నాయి. అయితే పంచాయతీలకు సర్పం చులు లేకపోవడం, అధికారులు కూడా ప్రభుత్వ పథకాల అమలులో తీరిక లేకుండా ఉండటంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఏడు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. వేధిస్తున్న సమస్యలు నకిరేకల్తో పాటు ఆరు విలీన గ్రామాల్లో ఎక్క డి సమస్యలు అక్కడే ఉన్నాయి. నకిరేకల్లో ప్రధానంగా డ్రెయినేజీ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యతో పాటు పలు కాలనీల్లో వీధి వీధి దీ పాలు సరిగా వెలగడం లేదు. సీసీ రోడ్లు కూడా సరిగా లేవు. ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నకిరేకల్లో డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి రూ.5కోట్లు నిధు లు మంజూరు చేస్తానని ప్రకటించినప్పటికీ ఇంకా ఆచరణలో ఆమోదం లభించలేదు. కడపర్తికి 20 రోజులుగా కృష్ణా జలాల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు ప డుతున్నారు.చందుపట్లలో మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. తాగునీటి ట్యాంకును సైతం శుభ్రం చేసేవారు లేక గ్రామస్తులు అందులోని నీటిని సేవించడమే మానేశారు. ప్యూరిఫైడ్ వాటర్ను కొనుగోలు చేస్తూ దా హం తీర్చుకుంటున్నారు. తాటికల్లోనూ ఇదే పరిస్థితి. కృష్ణా జలాలు అందక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి.నోముల, చందంపల్లి, నెల్లిబండ గ్రామాల్లో పారిశుధ్యం తాండవిస్తోంది. అంతేకాకుండా సర్పంచ్లు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని అయోమయంలో ప్రజలు ఉన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి నకిరేకల్ పట్టణంతో పాటు మిగితా ఆరు గ్రామాల్లోనూ తక్షణమే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడింది. ప్రత్యేక పాలనలో అధికారి అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు తీరడం లేదు. -గాదగోని కొండయ్య, తాటికల్ ప్రభుత్వం చొరవ చూపాలి మా గ్రామాన్ని గతంలో మున్సిపాలిటీలో కలిపారు. ఆ తరువాత మున్సిపాలిటీ రద్దు కావడంతో ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. సర్పంచ్ల పాలన జరిగేలా చూడాలి. -నక్క రాంబనేష్ ముదిరాజ్, కడపర్తి