
సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్లో కొత్త మంత్రులు మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్(ధర్మపురి) ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఎవరికి ఏ శాఖ?
కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దానిపై చర్చ నడుస్తుంది. ఇవాళ సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. సీఎం రేవంత్రెడ్డి దగ్గర హోం, మున్సిపల్, విద్య, సంక్షేమ శాఖలు ఉండగా.. ఆ శాఖలే కొత్త మంత్రులకు కేటాయించనున్నారు.

👉వివేక్ రాజకీయ ప్రస్థానం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి.
అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్ పేరు ఖరారు చేసింది

👉శ్రీహరి రాజకీయ ప్రస్థానం
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు.

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది.

👉లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానం
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.