పాలించే సత్తా లేకున్నా దేశాన్ని ఉద్ధరిస్తారా?: ఈటల
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: పరిపాలించే సత్తా, సమస్యలు పరిష్కరించే దమ్ము లేకపోయినా దేశాన్ని ఉద్ధరిస్తానని సీఎం కేసీఆర్ గొప్పలు పోవ డాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనపై శుక్రవారం ఈటల విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ పరిపాలన చేతకాక.. బెంగాల్ పోతా, పంజాబ్ పోతా, కర్ణాటక పోతా.. అంటూ కేసీఆర్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
‘పెన్షన్లు 2, 3 నెలలకోసారి వస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేక పోతున్నారు’ అని ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో శుక్రవారం పర్యటించిన ఈటల విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏటా రూ.25వేల కోట్ల భారం ప్రజలపై మోపారని విమర్శించారు.