
ఢిల్లీ : తెలంగాణ కేబినెట్ విస్తరణ పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు చర్చలు జరిపి ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ కేబినెట్ పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీకి క్యూకట్టిన తరుణంలో ఆ నివేదికను అధిష్టానం పక్కన పెట్టేసింది.
అయితే ప్రస్తుతం మాదిగ కులానికి చెందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకున్నారు. తమ కులానికి కూడా కేబినెట్ లో పెద్ద పీట వేయాలని వారు పట్టుబడుతున్నారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణలో తమ కులానికి అవకాశం కల్పించాలంటూ అధిష్టానం పెద్దలను కలవడానికి వారు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు.
మాది న్యాయమైన డిమాండ్..
‘మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం గురించి సీఎం, పీసీపీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కి తెలిపే ఢిల్లీ వచ్చాం. మాది న్యాయమైన డిమాండ్. మాదిగ కులస్తునికి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాలి. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం పెద్ద సామాజిక వర్గం. మాదిగ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి ఉండాలి.
మాదిగ వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కి అండగా ఉంది. మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మాకు అభ్యంతరం లేదు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించేది అధిష్టానం కాబట్టి ఢిల్లీ వచ్చాం. మంత్రివర్గంలో మాదిగలకు కచ్చితంగా స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాం. మొదటి కేబినెట్ ఏర్పాటులో మాకు అవకాశం దక్కుతుందని భావించాం. ఇప్పుడు రెండోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాదిగ సామాజిక వర్గంలో ఏ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు’ అని వారు స్పష్టం చేశారు.
అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, కవ్వం పల్లి సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు,. ఈరోజు(గురువారం) అధిష్టానం పెద్దలను వీరు కలిసే అవకాశం ఉంది.