కేసీఆర్‌కు నీతి ఆయోగ్‌ ప్రాధాన్యత తెలియదు  

Telangana BJP State Vice President NVSS Prabhakar Criticized CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ ప్రాధాన్యత తెలియకనే ప్రధాని అధ్యక్షతన జరిగిన భేటీకి సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విమర్శించారు. రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి, దేశ అభ్యున్నతికి దోహదపడుతున్న నీతి ఆయోగ్‌ను విమర్శించి, కేసీఆర్‌ తన నైజాన్ని మరో సారి చాటుకున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై రాష్ట్రానికి ఏం కావాలో చెప్పుకునే విజ్ఞత కూడా ముఖ్యమంత్రికి లోపించడం విచారకరమన్నారు. ప్రధాని మోదీని విభేదించే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌తో పాటు నవీన్‌ పట్నాయక్‌ వంటి వారు కూడా సమావేశానికి వచ్చి ఆయా రాష్ట్రాల హక్కులను సాధించుకుంటున్నారని తెలిపా రు.

రాష్ట్రాల అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించే నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజరుతో ఆయనకు రాష్ట్ర ప్రజల పట్ల గల చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మతితప్పి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాను తప్ప మంత్రులు, కలెక్టర్లకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వని కేసీఆర్‌ నీతి ఆయోగ్‌పై విమర్శలు చేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.      

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top