గ్రేటర్ సిటీ ప్రతిష్టను టీడీపీ మంటగలిపే ప్రయత్నం చేస్తుందా..?

Is TDP Trying To Tarnish The Image Of Visakha City - Sakshi

విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి నగరంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందా? ఎల్లో మీడియాతో కలిసి లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ..ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందా? ఎక్కడో జరిగిన సంఘటనలను విశాఖకు ముడిపెట్టి గ్రేటర్ సిటీ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తుందా..? 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో విశాఖపట్నంపై టిడిపి కుట్రలు చేస్తోందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. లోకేష్, చంద్రబాబు విశాఖ వచ్చిన ప్రతి సందర్భంలోనూ నగరం మీద విషం చిమ్ముతూనే ఉంటున్నారని అనుకుంటున్నారు. 

* సమీప భవిష్యత్తులో విశాఖ సముద్ర తీరం మునిగిపోతుందంటూ ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయించారు. నగరం మునిగిపోతుంది కాబట్టి.. విశాఖ పరిపాలనా రాజధానిగా పనికిరాదంటూ అదే పనిగా తప్పుడు ప్రచారం చేశారు.   

* విశాఖ సమీపంలోని సముద్ర గర్భంలో ఖండాంతర చీలికలు వచ్చి తీరంలో సునామిలు సంభవిస్తాయంటూ కొన్ని వార్తలు సృష్టించారు. ముందు సోషల్ మీడియాలో, తర్వాత ఎల్లో మీడియాలో అచ్చేయించి వికృతానందం పొందారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర చేశారు. 

* ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని బూచిగా చూపించి భయపెట్టారు. విశాఖ నగరం విష వాయువులు, రసాయనాలతో కూడిన ప్రాంతమని ప్రచారం చేశారు. ప్రమాదాలు జరిగే నగరమంటూ విశాఖపట్నంపై వరుసగా ఎల్లో మీడియాలో చర్చలు పెట్టారు. 

* ఒక్క విశాఖ నగరంలోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు,  ప్రపంచంలో ఎక్కడా ఏవీ జరగనట్టుగా కలరింగ్ ఇచ్చి ప్రజలను, తద్వారా రాష్ట్రాన్ని మభ్యపెట్టడంలో ఏ రోజుకు ఆ రోజు చేయని ప్రయత్నం లేదు. 

* సముద్ర తీరం కోత పైన, సునామీలపైన విశాఖ నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చినా టిడిపి నేతలు తమ వంకర బుద్ధిని మార్చుకోలేదు. 

* రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం జరిగితే దాన్ని వైఎస్సార్సీపీసీకి అంటగడుతూ విశాఖ నగరంలో వైఎస్సార్సీపీ నేతల రౌడీయిజం పెరిగిపోయిందంటూ నారా లోకేష్ అదే పనిగా ప్రచారం చేస్తున్నాడు. ప్రజలు నమ్మకపోయినా.. చెప్పిందే చెప్పి ఎల్లో మీడియా ద్వారా కళ్లకు గంతలు కట్టే పనిలో పడ్డాడు.

* టీడీపీ ప్రభుత్వం హయాంలో కేటాయించిన భూములను వైఎస్ జగన్‌ హయాంలో కేటాయించినట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసే పనిలో పడ్డాడు లోకేష్. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు NCC సంస్థకు భూముల్ని కేటాయించారు. దీన్ని పట్టుకొని టిడిపి నేతలు విశాఖలో భూ కుంభకోణం జరిగిపోయిందంటూ నానా రాద్దాంతం చేశారు. 

* సుప్రీంకోర్టు తీర్పు మేరకు రుషికొండలో నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు మాత్రం రుషికొండలో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారు. 

ఎప్పుడైతే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారో అప్పటినుంచి టీడీపీ ఏదో ఒక రూపంలో విశాఖపై తప్పుడు ప్రచారం చేస్తోందని స్థానికులంటున్నారు. నిజానికి విశాఖలో భూకబ్జాలకు పాల్పడింది, ప్రభుత్వ భూములను అక్రమంగా దోచుకుంది టిడిపి ప్రభుత్వ హయంలోనేని గుర్తు చేస్తున్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి వేల ఎకరాలను టిడిపి నాయకులు దోచుకున్నారని చెబుతున్నారు. విశాఖను అభివృద్ధి చేద్దామన్న ఆలోచన రాగానే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top