తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దౌర్జన్యం | Tdp Mla Kolikapudi Srinivas Attacks Ysrcp Leader House | Sakshi
Sakshi News home page

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దౌర్జన్యం

Jan 11 2025 8:09 PM | Updated on Jan 11 2025 8:18 PM

Tdp Mla Kolikapudi Srinivas Attacks Ysrcp Leader House

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దౌర్జన్యానికి దిగారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో వైఎస్సార్‌సీపీ నేత భూక్య కృష్ణ ఇంటిపై దాడి చేశారు.

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ దౌర్జన్యానికి దిగారు. ఏ.కొండూరు మండలం గోపాలపురంలో వైఎస్సార్‌సీపీ నేత భూక్య కృష్ణ ఇంటిపై దాడి చేశారు. దాడిని  చిత్రీకరిస్తున్న కృష్ణ కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు. కృష్ణ కుమారుడు గోపిచంద్‌ ఫోన్‌ను ఎమ్మెల్యే కొలికపూడి ధ్వంసం చేశారు. భూక్య కృష్ణ భార్యను కూడా కొలికపూడి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపంతో కృష్ణ భార్య పురుగుల మందు తాగారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు వైద్యులు రిఫ్‌ చేశారు. కొలికపూడి దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

భూక్యా కృష్ణ- భూక్యా నాగేశ్వరరావు, భూక్యా భీమ్లా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఉండగా, ఆస్తి పంపకాలు సవ్యంగా చేస్తామని గతంలో పెద్ద మనుషులు ఒప్పించారు. భూక్యా కృష్ణ ఆమోదంతో అతని స్థలంలో నుంచి నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. స్థలం వివాదం తేలకపోవడంతో తన స్థలంలో నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా  భూక్యా కృష్ణ తీగ  వేశారు.

ఇదిలా ఉండగా, గోపాలపురం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి హాజరయ్యారు. గోపాలపురం 5వ వార్డు వైఎస్సార్‌సీపీ సభ్యుడిగా ఉన్న భూక్యా కృష్ణపై ఎమ్మెల్యేకు  స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా భూక్యా కృష్ణ ఇంటికెళ్లిన  ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. వారిపై దాడి చేశారు. సంఘటనను ఫోన్‌లో చిత్రీకరిస్తున్న భూక్యా కృష్ణ కుమారుడు గోపీచంద్‌పైనా దౌర్జన్యం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement