దేశాన్ని విభజించే కుట్ర పన్నుతున్నారు
అందుకే విద్వేష రాజకీయాలు: మమత
కోల్కతా: కొందరు నేతలు విద్వేష రాజకీయాలతో దేశాన్ని విభజించే కుట్రలకు తెరతీశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వారి కుట్రలను సాగనివ్వను. ఈ పోరాటంలో ప్రాణాలనైనా అర్పిస్తా’’ అని శనివారం కోల్కతాలో ఈద్ నమాజ్ సందర్భంగా ఆమె అన్నారు. ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది.
విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది. అయినా తలవంచే ప్రసక్తే లేదు’ అన్నారు. ‘‘ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలున్నాయి. విభజన శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదాం. ఒక్కటిగా ఓటేసి బీజేపీని గద్దె దింపుదాం. ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం విఫలమైతే అంతా అయిపోయినట్లే’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలపై ఈ సందర్భంగా మమత విమర్శలు గుప్పించారు.