టీఎంసీ బెంగాల్ చీఫ్ పదవికి చంద్రిమ భట్టాచార్య రాజీనామా
కోల్కతా: తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేల వెన్నుపోటుతో ఇప్పటికే ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి శనివారం మరో కీలక నేత గుడ్బై చెప్పారు. ప్రస్తుతం పార్టీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్న చంద్రిమ భట్టాచార్య తన పదవితోపాటు పా ర్టీలో తనకు అప్పగించిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ చైర్పర్సన్ మమతా బెనర్జీకి చంద్రిమ రాజీనామా లేఖరాశారు. రాష్ట్ర చీఫ్గా ఆసీనురాలైన నెల రోజులకే ఆ పీఠం నుంచి చంద్రిమ కిందకు దిగిపోవడం గమనార్హం. టీఎంసీని వీడుతున్న చంద్రిమ త్వరలోనే టీఎంసీ తిరుగుబాటుదారుల శిబిరాన్ని ఆశ్రయించబోతున్నారని సమాచారం.
పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ అనుబంధ సంస్థలు, పా ర్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలకు సంతకంచేసే హోదాను సైతం చంద్రిమ వదులుకున్నారు. మమతకు అత్యంత నమ్మకమైన నాయకురాలిగా కొనసాగిన చంద్రిమ గతంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకుడు సుబ్రతా భక్షీ స్థానంలో జూన్ మూడోతేదీన బెంగాల్ పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు.
అయితే రితబ్రత బెనర్జీ సారథ్యంలోని తిరుగుబాటు నేతలు శుక్రవారం టీఎంసీ భవన్ కార్యనిర్వాహక కేంద్ర కార్యాలయానికి వచ్చి సమావేశం ఏర్పాటుచేసుకుని తర్వాత భవనాన్ని తమ వశం చేసుకుంటున్నా చంద్రిమ చేష్టలుడిగి చూస్తున్నారని, వాళ్లను అడ్డుకోలేకపోయారని మమత ఫోన్చేసి చీవాట్లు పెట్టడంతో బాధపడినట్లు చంద్రిమ తర్వాత మీడియాతో తెలిపారు. ‘‘నేనేదో కావాలని పార్టీ ఆఫీస్ను రెబెల్స్కు ఉద్దేశపూర్వకంగా అప్పగించినట్లు మమత మాట్లాడుతున్నారు. పా ర్టీకి విశ్వాసపాత్రురాలిగా ఉన్నందుకు దక్కే బహుమతి ఇదేనా?. ఇంత అవమానం జరిగాక పా ర్టీలో ఉండటం సబబుకాదు’’అని చంద్రిమ అన్నారు.
సంక్షోభానికి బీజేపీయే కారణం: మమత
తన పార్టీలో చీలికలు, అంతర్గత విభేదాలకు బీజేపీయే కారణమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ తిరుగుబాటుదారులపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘టీఎంసీలో చీలిక తెచ్చి వేరుకుంపటి పెట్టిన ద్రోహులకు దమ్ముంటే వేరుగా ఉండేబదులు నేరుగా బీజేపీలో చేరండి. బీజేపీలో చేరాక నన్ను ఎదుర్కోండి. అంతేగాని బీజేపీ మద్దతుతో ఇలా నమ్మకద్రోహ క్రీడ ఆడకండి. హఠాత్తుగా రెబెల్స్ ఎలా అయ్యారు? ఎన్నికలకు ముందు ఈ రెబెల్స్ ఎక్కడున్నారు? టీఎంసీ టికెట్పై ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచి 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు ఈ తిరుగుబాటు గుర్తుకురాలేదా?’’అని మమత ప్రశ్నించారు.


