
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పని అయిపోయిందని.. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా ఆయనకు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. యోగా డే పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ.. శనివారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మామిడి రైలు సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు తీరుతో తీరుతో ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. చివరకు సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఆయనకు ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది. సీఎంగా చంద్రబాబు పని అయిపోయింది.
👉జగన్ మొన్నీమధ్యే వెళ్లి వచ్చాక కేంద్ర మంత్రి వెళ్లి పొగాకు రైతులను కలిశారు. గతంలో గిట్టుబాటు ధరలు లేకపోతే జగన్ పిలిచి చర్చలు జరిపేవారు. గిట్టుబాటు ధర వచ్చేదాకా చేయాల్సిందంతా చేసేవారు. కానీ, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదు. కేవలం మీడియా హైప్తోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు.
👉రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కూటమి పాలనలో వీధుల్లోనే గంజాయి అమ్ముతున్నారు. కుప్పంలో జరిగే అరాచకాలు చంద్రబాబుకి కనిపించడం లేదా?. పోలీసుల వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అమాయకులపై, వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు.
అడిగితే తాట తీస్తా! అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను సజ్జల వీడియో ప్రదర్శించి చూపించారు.
👉హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తన ఉంటోంది. చంద్రబాబు తాను చేసే తప్పులను ఎదుటి వారిపై నెడతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏది జరిగినా జగన్పై నెపం వేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీకొడుకులు డ్రామాలు చేస్తున్నారు. యోగా బాగా అలవాటు ఉండేవారికి స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. కానీ, చంద్రబాబు మోహంలో అదే క్రూరత్వం, కుటిలత్వం కనిపిస్తున్నాయి.

👉చంద్రబాబు ఏడాది పాలనంతా డొల్లా. ఆయనకు అధికారం అంటే బాధ్యత లేదు. లేని స్కాం పేరు చెప్పి డ్రామా చేస్తున్నారు. ఐదేళ్లు లిక్కర్స్కాం పేరుతో కథ నడిపిస్తారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయి. ఆయన అధికారంలో వచ్చాక అనేక పథకాలకు కోత పట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు తప్పకుండా చంద్రబాబుని నిలదీస్తారు.
👉వైఎస్సార్సీపీ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబుకి అసలు పరిపక్వతే లేదు. ప్రెస్ మీట్లో జగన్ అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వడం లేదు. భూస్థాపితం చేస్తారట.. తాట తీస్తారట.. ఇవేనా ఆయన ఇచ్చే సమాధానాలు. రప్పా రప్పా ఫ్లకార్డులపై నానా రాద్దాంతం చేస్తున్నారు. ఆ ఫ్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్తే. పవన్ కల్యాణ్ ఎక్కడ? రాష్ట్రంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
👉వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ నిబద్ధతతో ఇచ్చిన హామీలు అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లక్షా 67 వేల కోట్లు అప్పు చేశారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడది చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ హామీలు అమలు చేసేదాకా ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూనే.. పోరాడుతూనే ఉంటుంది అని సజ్జల ఉద్ఘాటించారు.