
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్సీపీ ఇవాళ(బుధవారం, జూన్ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన.
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది.
అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ..
చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్ చేశారు. వైఎస్ జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు.
