
సాక్షి, అమరావతి: టీడీపీ నీచ రాజకీయాలు మరోసారి బయట పడ్డాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రాజా అన్నారు. మార్ఫింగ్ వీడియోలతో రాజకీయం చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీపై, ప్రభుత్వంపై బురదజల్లటానికి టీడీపీ నేతలు ఎంతగా దిగజారి పోయారో ప్రజలందరూ చూశారన్నారు. ఐ టీడీపీ అంటే లోకేశ్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం అని ఆరోపించారు. అందులో మార్ఫింగ్ వీడియోలు అప్లోడ్ చేసి, ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బకొట్టాలనే కుటిలయత్నం బట్టబయలు అయిందన్నారు. బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి కానీ, మార్ఫింగ్ వీడియోలతో కాదని హితవు పలికారు. టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని అందరూ అనుకొంటున్నారన్నారు. జగన్ లాంటి సీఎం ఉండటం అదృష్టం అని మహిళలు భావిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి సహించలేక.. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై సాగిన దారుణాల గురించి ఆ పార్టీ మహిళా నేత అనిత సమాధానం చెప్పాలని నిలదీశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొన్న బుద్దా వెంకన్న, బోడే ప్రసాద్లను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను అడ్డుకొన్న మహిళాధికారిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు.