వివేకా హత్య వెనుక మహాశక్తులను వెలికి తీయాలి

Ravindranath Reddy Comments On YS Viveka Case - Sakshi

కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 

కడప కార్పొరేషన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న మహాశక్తులను వెలికి తీయాల్సిన బాధ్యత సీబీఐ అధికారులపై ఉందని వైఎస్సార్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోందని, దీని వెనుక హైలెవెల్‌ మేనేజ్‌మెంట్‌ జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ఈ కేసు విషయాలు తెరపైకి వస్తున్నాయన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ని, వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టేందుకే ఇలా జరుగుతోందన్నారు.

2019 ఎన్నికలు జరిగినప్పుడు, ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఇదే తరహా వార్తలు ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ముందు సీన్‌ తయారు చేసుకుని, తర్వాత ఆర్టిస్టులు, సినిమా బయటికి వస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి దర్శకత్వం వహించేది ఎవరో తేలాల్సి ఉందన్నారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేరు లేకపోయినా కొన్ని పత్రికలు, చానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్‌ వివేకా సౌమ్యుడని, బుద్ధుడికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఆయన్ని ఆ రకంగా హత్య చేయడం దురదృష్టకరమన్నారు. బెంగళూరు రియల్‌ ఎస్టేట్‌ దందా వెనుక ఎవరున్నారో వెలికితీయాలన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top