బీజేపీ.. బక్వాస్‌ జ్యాదా పార్టీ 

PUC Chairman Jeevan Reddy Fires On BJP - Sakshi

వారిది అనాగరిక ఎజెండా.. మాది అభివృద్ధి ఎజెండా

పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీది అనాగరిక ఎజెండా అయితే తమది అభివృద్ధి ఎజెండా అని అసెంబ్లీ పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ చైర్మన్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి అన్నారు. బీజేపీలో క్రమశిక్షణ లోపించిందని, ఆ పార్టీలో ఉన్న గాడ్సే వారసులు తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన గాంధీలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషిస్తున్నారన్నారు.  చదవండి: (డీఎన్‌ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్‌ సిద్ధమా?)

ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం తెలంగాణ భవన్‌లో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ‘బక్వాస్‌ జ్యాదా పార్టీ’లా మారిందని, కేసీఆర్, కేటీఆర్‌ను ట్రంప్‌తో పోలుస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోదీ ‘నమస్తే ట్రంప్‌’ను ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ వరద బాధితులకు రూ.25 వేల సాయం అందిస్తామని బీజేపీ ప్రకటించినా, కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నయా పైసా తేలేదని విమర్శించారు. 

తరుణ్‌ చుగ్‌కు రాజకీయ అనుభవం లేదు 
పంజాబ్‌ రైతులను అర్బన్‌ నక్సలైట్లతో పోల్చిన తరుణ్‌ చుగ్‌కు రాజకీయ అనుభవం లేదని ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందని, ఎంపీగా బండి సంజయ్‌ కరీంనగర్‌ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top