సాక్షి, అమరావతి: కూటమి సర్కార్పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రతీకార రాజకీయాలు ఆపాలన్న ప్రకాష్రాజ్.. ‘‘మాపై రుద్దబడుతున్న ఈ కఠినమైన ఉపా చట్టాన్ని తొలగించండి అంటూ ట్వీట్ చేశారు.
కాగా, యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాష్రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా టీడీపీ కూటమి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. ‘ఉపా చట్టం కింద ఓ యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారా? ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా?’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇంకా ఇంకా దిగజారండి..’ అంటూ ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.
మరో వైపు, విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూటమి నేతల తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనుక వైఎస్సార్సీపీ ఉందంటారా? రేపొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలొస్తే దాని వెనుక కూడా వైఎస్సార్సీపీ ఉందని ఆరోపిస్తారా?’ అంటూ ఆయన మండిపడ్డారు.
ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై లేదా అధికార కూటమిపై విమర్శలు వినిపించిన ప్రతిసారీ వాటివెనుక వైఎస్సార్సీపీ ఉందని ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. సామాజిక కార్యకర్తలు, మేధావులు, సినీ ప్రముఖులు లేదా సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వారిని ప్రతిపక్షంతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా సినీ నటుడు ప్రకాష్రాజ్ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటే.. ఆయన వెనుక వైఎస్సార్సీపీ ఉందనే ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తున్నారంటూ నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


