Opposition Unity Is Impossible - Sakshi
Sakshi News home page

కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. కలిసుండేది కష్టమే.. ఎవరి లెక్కలు వారివి..

Published Tue, Jul 18 2023 8:55 PM

Opposition Unity is Impossible - Sakshi

బెంగళూరు: కాంగ్రెస్ కూటమి సమావేశానికి హాజరైన ప్రతిపక్షాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీది మరోవ్యూహం. బెంగాళ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో ఫైట్ చేయడానికి దీదీకి జాతీయ స్థాయిలో ఒక కూటమి అవసరం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం తానే అని మమతా ప్రొజెక్టు చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యారు.

దీదీకి పీఠంపై కన్ను..
బెంగాల్‌లో లోక్‌సభ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తే తాను ప్రతిపక్షాల తరుపున ప్రధాని రేస్‌లో  ఉంటానని మమత అనుకుంటున్నారు. ప్రస్తుతం బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. కేవలం నాలుగైదు జిల్లాల్లోనే ఉన్న కాంగ్రెస్‌తో తనకు ప్రమాదం లేదని మమత భావిస్తోంది. అందుకే కాంగ్రెస్‌తో కూటమిలో చేరితే అటు ముస్లిం ఓట్లను సాధించడంతో పాటు లెఫ్ట్ పార్టీలను ఒంటరి చేయవచ్చనేది దీదీ ప్లాన్.  

పెద్దన్నది పెద్ద ప్లానే..
ఇక ఎవరి వ్యూహాలు వారికి ఉంటే కాంగ్రెస్ మాత్రం అందరికి మించిన ప్లాన్ వేసింది.  కర్ణాటక  గెలుపుతో వచ్చిన పాజిటివ్‌ వేవ్‌కు తోడుగా కూటమిని ఏర్పాటు చేస్తే బలం మరింత పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి ద్వారా తాము బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నామని ప్రజలను నమ్మించడం కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఎవరితో ఎన్ని విభేధాలున్నా.. కాంగ్రెస్ ఇప్పుడు కూటమి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

కూటమితో మరోసారి జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టగలమని క్యాడర్‌కు ధైర్యం ఇస్తే .. రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పనికొస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. టార్గెట్‌ 2024 లోక్‌సభ ఎన్నికలని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ అసలు లక్ష్యం మాత్రం 2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని సుస్పష్టం. అందుకే కళ్లముందు కూటమి కనిపిస్తున్నా.. ఐక్యత అనేది అసాధ్యమని తేలిపోతోంది.

-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ
 

Advertisement
Advertisement