లోకేష్ వ్యాఖ్యలు.. జనం గుసగుసలు
సాక్షి, వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తానని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం వరదయ్యపాళెంలో నిర్వహించిన రోడ్షోలో లోకేష్ ప్రజలకు ఈ మాయమాటలు చెప్పారు. మాజీ సీఎం తనయుడి సభకు వెయ్యి మంది కూడా జనం హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
ఉపఎన్నికల ప్రచారంలో లోకేష్.. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పదేపదే విమర్శించడంపై జనం విసిగిపోయారు. పనబాక లక్ష్మి గెలుపునకు పెట్రోల్, గ్యాస్ ధరల తగ్గింపుకు సంబంధమేముందని, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం విచిత్రంగా ఉందని జనం గుసగుసలాడారు. మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకనే రాష్ట్ర ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలతో తన ప్రసంగాన్ని ముగించారు లోకేష్.