వచ్చే ఐదేళ్లు దేశ సేవకే అంకితమవుతాం: నరేంద్ర మోదీ | modi speech after meeting president droupadi murmu over govt formation | Sakshi
Sakshi News home page

వచ్చే ఐదేళ్లు దేశ సేవకే అంకితమవుతాం: నరేంద్ర మోదీ

Jun 7 2024 6:52 PM | Updated on Jun 7 2024 7:19 PM

modi speech after meeting president droupadi murmu over govt formation

న్యూఢిల్లీ, సాక్షి: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్ష నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి తెలిపారు. ఎన్డీయే కూటమి ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి మోదీ అందజేశారు.  అనంతరం  మోదీ మీడియాతో మాట్లాడారు. 

‘‘ 18వ లోక్‌సభ చాలా ప్రత్యేకం. ఎన్డీయేకు మూడో సారి దేశ సేవ చేసే భాగ్యం లభించింది. ఈ అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే ఐదేళ్లు దేశసేవకే అంకితమవుతాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పూర్తి చేసేందుకు శ్రమిస్తాం. 

ఎన్డీయే నేతలు నన్ను మరోసారి పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముమ్ముందు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఆజాదీగా అమృత్‌ ఉత్సవాల తర్వాత ఇదే తొలి ఎన్నిక. మంత్రి మండలి జాబితా ఇవ్వాలని రాష్ట్రపతి కోరారు. ఎల్లుండి సాయంత్రం ప్రమాణస్వీకారం  సౌకర్యంగా ఉంటుంది. మంత్రుల జాబితాను రాష్ట్రపతికి అందజేస్తాను’ అని మోదీ తెలిపారు.

 

భాగస్వామ్య పక్షాల నేతలు వెంటరాగా.. మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేశారాయన. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ముర్మును మోదీని ఆహ్వానించారు.

జేపీ నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై  కసరత్తు
మంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కసరత్తు జరుగుతోంది. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లు.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. బీజేపీ అగ్ర నేతలు.. అజిత్ పవార్, ఏక్‌నాథ్‌ షిండేతో చర్చలు జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement