
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలను అమలు చేయాలనే గొంతులను మాత్రం ఏడాదిది నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, జూన్ 12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయాన్ని గుర్తుచేశారు.
‘తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నామని అబద్దం చెబుతున్నారు.రికార్డ్స్ ప్రకారం దాదాపు 87 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేయాలి. పదమూడు వేల కోట్ల రూపాయిలు తల్లికి వందనం పథకానికి కావాలి. కానీ తల్లులను చంద్రబాబు మోసం చేశారు. తల్లికి వందనం కాదు తల్లికి వంచనగా మార్చారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం అని తెలియదా?, దీనిపై ప్రజలు ప్రశ్నించకూడదా?, దమ్ము దైర్యం ఉంటే ఈ ఏడాది కాలంలో మీరు అమలు చేసిన పథకాలను ముద్రించి ప్రజల ముందు ఉంచగలరా చంద్రబాబూ?, ప్రజా స్వామ్య విలువలు పాటించకపోతే ఇక ఈ ప్రభుత్వం ఎందుకు?, ఒక పథకాన్ని అమలు చేయడంలో ఇంత వంచనా?, ఇవ్వాల్సిన సొమ్ములో రెండు వేలు కట్ చేసి, తల్లికి వందనం సంపూర్ణం అని ఎలా చెబుతారు?, P4 అనేది ప్రణాళిక లేని కార్యక్రమం. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు.
దళితుల కుటుంబాలను జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తే మీకు కడుపు మంట ఎందుకు?, రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు నిలయంగా మార్చారు.శవాల దిబ్బగా రాష్ట్రాన్ని మార్చాలి అనుకుంటున్నారా?, ప్రభుత్వంపై ఏడాదిలోనే ఇంతగా రైతులు తిరగ బడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు.ప్రభుత్వం పై రైతులు తిరగబడితే రౌడి లా కనపడుతున్నారా?, రైతులను రౌడీలంటూ అగౌరవపరుస్తారా?, ఇదేనా మీ సంస్కారం?’ అని విమర్శించారు.