ఎంజే మార్కెట్ ఆధునికీకరణ అధ్వానం
అబిడ్స్: ఎంజే మార్కెట్ ఆధునికీకరణ అధ్వానంగా ఉందని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా అన్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఎంజే మార్కెట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.... 85 సంవత్సరాల నాటి ఎంజే మార్కెట్ను రూ.16 కోట్లు పెట్టి ఆధునికీకరించినా సమస్యలన్నీ అలాగే ఉన్నాయన్నారు. ఐదు రోజులపాటు కురిసిన వర్షాలకే ఎంజే మార్కెట్ వాన నీటితో నిండిపోవడం దారుణమన్నారు. ఎంజే మార్కెట్లో స్లాబ్కు రంద్రాలు పడటం, వర్షపు నీరు నిలిచిపోవడం చూస్తుంటే రూ.16 కోట్లు దేనికి ఖర్చు చేసినట్టు అని ఆయన ప్రశ్నించాడు. ఈ పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము వృథా చేయడం దారుణమన్నారు.