తొలి రోజే టీడీపీ డ్రామా మొదలైంది: మంత్రి కొట్టు | Sakshi
Sakshi News home page

ఇది మీ దురహంకారానికి పరాకాష్ట: మంత్రి కొట్టు

Published Thu, Sep 15 2022 3:34 PM

Minister Kottu Satyanarayana Fires on TDP Drama in Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ డ్రామా మొదలైందని.. వారికి ఏ మాత్రం సిగ్గులేదని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. 'ఈ రాష్ట్రంలో జాబు రావాలంటే జగన్‌ మోహన్‌రెడ్డి ఉండకూడదా?. గతంలో బాబు వస్తే జాబు అన్నారు. నారా లోకేష్‌ నాయుడికి తప్ప ఎవరికైనా జాబ్‌ వచ్చిందా?. లోకేష్‌కు జాబ్‌ వస్తే రాష్ట్రంలో అందరికీ జాబ్‌ వచ్చినట్లేనా? అంటూ ప్రశ్నల వర్షం​ కురిపించారు. 

రాష్ట్రంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని అన్నారు. వైద్యరంగానికి సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ జగన్‌ దిగిపోతేనే ఉద్యోగాలొస్తాయనడానికి టీడీపీకి సిగ్గులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీ దురహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

'మళ్లీ బాబు వస్తే లోకేష్‌కు ఉద్యోగం కట్టబెట్టాలన్నదే మీ ఆలోచన. మెడికల్‌ వ్యవస్థలో పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది. టీడీపీకి రాజకీయంగా నూకలు చెల్లిపోయాయి. మీ డ్రామాలు ఎవరూ నమ్మరు' అని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

చదవండి: (వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే: మంత్రి బుగ్గన)

Advertisement
Advertisement