సీఎం ప్రశ్నలకు బీజేపీ బదులివ్వాలి | Minister Koppula Eshwar Demand Bjp To Respond CM KCR Questions | Sakshi
Sakshi News home page

సీఎం ప్రశ్నలకు బీజేపీ బదులివ్వాలి

Jul 12 2022 2:34 AM | Updated on Jul 12 2022 2:34 AM

Minister Koppula Eshwar Demand Bjp To Respond CM KCR Questions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లేవనెత్తిన ప్రశ్నలకు ముందుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం బదులివ్వాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని హితవు పలికారు. సీఎం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, ఆలయాల అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నాయకులు అర్థంపర్థం లేకుండా మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీజేపీ నేతలకు క్షుద్ర రాజకీయాలు తప్ప, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల బాగోగుల గురించి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు. కేంద్రం నుంచి రూపాయి కూడా తెచ్చే తెలివి లేని నేతలు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తమకు గిట్టని నాయకులపై ఐటీ, ఈడీ, ఐబీ, సీబీఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేయడం బీజేపీకి పరిపాటి అయ్యిందన్నారు. దాడులతో నేతలను లొంగదీసుకోవడం, ప్రభుత్వాలను పడగొట్టడమే ఆ పార్టీ జాతీయ నాయకత్వం లక్ష్యమని మండిపడ్డారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిన బీజేపీ నాయకులకు ప్రజాస్వామ్యమంటే కనీస గౌరవం లేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement