మనం ఇంట్లో లేని సమయంలో అతిథులు ఇంటికి వస్తున్నారు.. గుమ్మలోకి రాగానే ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.. హాల్లోకి అడుగు పెట్టగానే లైట్లు వెలుగుతాయి.. సోఫాలో కూర్చోగానే ఏసీ ఆన్ అవుతుంది. బాల్కనీ వైపు ఉన్న కర్టెన్లు తెరుచుకుంటాయి. ఇవన్నీ చేసేందుకు మెయిడ్(పనిమనిషి) అవసరం లేకుండా స్మార్ట్ఫోన్ నుంచే ఇవన్నీ సాధ్యం.. ప్రస్తుతం ఇంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది.
రియల్ టైమ్లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.
కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ హైదరాబాద్లోని హైఎండ్ ప్రాజెక్ట్లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది.


