లతా మంగేష్కర్​ మెమోరియల్​ రగడ​: సేన సెంటిమెంట్​ను కెలుకుతున్న బీజేపీ.. లతాజీ సోదరుడి ఫైర్​

Lata Mangeshkar Brother Reacts On Shivaji Park Memorial Row - Sakshi

Lata Mangeshkar Brother On Shivaji Park Memorial Controversy: దివంగత దిగ్గజ గాయని లతా మంగేష్కర్​ పేరిట స్మారక చిహ్నం నిర్మించే విషయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన.. ముంబై శివాజీ పార్క్​ వద్దే మెమోరియల్​ నిర్మించాలంటూ బీజేపీ పట్టుబడుతుండగా.. అధికార​ శివసేన అందుకు సుముఖంగా లేదు. శివాజీ పార్క్​ వద్ద మెమోరియల్​ నిర్మించాలంటూ ఆమె కుటుంబ సభ్యుల కోరికగా మొదలైన ప్రచారం.. ఈ రగడకు కారణమైంది.
 
బీజేపీ ఎమ్మెల్యే రామ్​ కదమ్​.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్​ థాక్రేకు ఓ లేఖ రాశారు. ఎక్కడైతే ఆమె అంత్యక్రియలు నిర్వహించారో.. అక్కడే స్మారకం నిర్మించాలంటూ డిమాండ్ చేశాడు. ఇది ఆమె కుటుంబ సభ్యుల కోరిక అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ వెంటనే మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు నానా పటోల్​.. ఈ డిమాండ్​కు మద్దతు ఇచ్చారు. ఆౕ వెంటనే మిత్రపక్షం(మహా వికాస్​ అగాధి) శివసేన ఒత్తిడితో ఆ డిమాండ్​పై స్వరం మార్చారు నానా. 

ఇక బీజేపీ డిమాండ్​పై అధికార శివసేన సుముఖంగా లేదు. అందుకు కారణం.. ఆ పార్క్​తో ఉన్న అనుబంధం. బాల్​ థాక్రే హయాం నుంచే సుమారు 28 ఎకరాల ఈ పార్క్​ నుంచి దసరా ర్యాలీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్దవ్​ థాక్రే కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈ సెంటిమెంట్​ నేపథ్యంలోనే లతాజీ మెమోరియల్​ నిర్మాణం డిమాండ్​పై మౌనం పాటిస్తోంది. ​ 

ఇక ఈ డిమాండ్​..అభ్యంతరాల నడుమ పలు పార్టీలు సైతం స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర నవ్​నిర్మాణ్​ సేనా9MNS) నేత సందీప్​ దేశ్​పాండే ఈ వ్యవహారంలో రాజకీయాలు తగవని అంటున్నారు. దాదర్​ ప్రజలు ఈ పార్క్​ ఆక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు.. సంరక్షించుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు అంటూ సందీప్​ ట్వీట్​ చేశారు. ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దిన ఈ మైదానంపై రాజకీయం తగదని పలు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ పట్టువీడడం లేదు.

ఇక శివసేన ప్రభుత్వం మాత్రం లతా మంగేష్కర్​ గౌరవార్థం కాళినలో ఒక అంతర్జాతీయ సంగీత అకాడమీని నెలకొల్పేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం 2.5 ఎకరాల స్థలం, సుమారు 1,200 కోట్ల ఖర్చును అంచనా వేసింది. ఈ నిర్ణయం ఆమెకు సరైన నివాళి అంటున్నారు ఆమె సోదరుడు హృదయనాథ్​ మంగేష్కర్​. 

లతా మంగేష్కర్​ మెమోరియల్​ డిమాండ్​పై ఆమె సోదరుడు, సంగీతకారుడు హృదయనాథ్ మంగేష్కర్​ స్పందించారు. శివాజీ పార్క్​ వద్ద మెమోరియల్​ నిర్మించాలన్నది తమ కుటుంబ డిమాండ్​ కాదని, దయచేసి వివాదానికి పుల్​స్టాప్​ పెట్టాలని ఆయన కోరారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం దయచేసి ఆపండి. అలాంటి డిమాండ్​ మా కుటుంబం నుంచి రాలేదు. అది మా అభిమతం కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top