కేసీఆర్‌ కాళ్లు పట్టుకొనైనా నరేందర్‌కు మంత్రి పదవి ఇప్పిస్తా: కేటీఆర్‌ | KTR Road Show And Meeting at Kodangal Slams Revanth Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కాళ్లు పట్టుకొనైనా నరేందర్‌కు మంత్రి పదవి ఇప్పిస్తా: కేటీఆర్‌

Nov 9 2023 7:27 PM | Updated on Nov 9 2023 8:11 PM

KTR Road Show And Meeting at Kodangal Slams Revanth Reddy - Sakshi

సాక్షి, వికారాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ధ్వజమెట్టారు. కొడంగల్‌ రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.. జైలుకు పోయే దొంగ కావాలా అని ప్రజలను అడిగారు. గత 55 ఏళ్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినా కొడంగల్‌లో ఎన్నడూ  అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కొడంగల్‌లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, లీడర్లను కొంటున్న రేవంత్‌.. ప్రజలను కొనలేడని పేర్కొన్నారు. రేవంత్‌ చేయలేని అభివృద్ధిని అయిదేళ్లలో పట్నం నరేందర్‌ రెడ్డి చేసి చూపెట్టారని తెలిపారు.

నరేందర్‌ వల్లే కొడంగల్‌కు డిగ్రీ కాలేజీ, దౌల్తాబాద్‌కు జూనియర్‌ కాలేజీ వచ్చిందన్నారు కేటీఆర్‌. కొడంగల్‌, కోస్గి, మద్దూర్‌లో 50 పడకల ఆస్పత్రి, ఇంకొక 50 పడకల ఆస్పత్రి, 30 పడకల ఆస్పత్రి తెచ్చింది నరేందర్‌ రెడ్డేనని చెప్పారు. కొండగల్‌లో మరోసారి నరేందర్‌ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్‌ కళ్లు పట్టుకొని అయినా సరే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పిస్తానని కేటీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెలిచిన తరువాత  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని అందిస్తామన్నారు.

‘కేసీఆర్‌కు సవాల్‌ విసురుతున్న రేవంత్‌ను చూస్తుంటే.. తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొడుతున్నట్లు ఉంది. గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో కొడంగల్ పేరును నాశనం చేశాడు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంటు పోయింది. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ అక్కర్లేదు. మా నరేందర్ రెడ్డి చాలు. ఇక్కడి ప్రజలను చూసి రేవంత్‌ 15వ తేదీన నామినేషన్‌ వెనక్కి తీసుకుంటాడు.

రేవంత్‌ ఓ బ్రోకర్‌. 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకునే పెయింటర్‌. ఆయనకిప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. బ్లాక్‌మెయిల్‌ చేయాలి, రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేయాలి. వాళ్లను బెదిరించాలి. సెటిల్‌మెంట్లు చేయాలి. నాలుగు పైసలు సంపాదించాలనేది రేవంత్‌ నైజం. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గ్రామలకు వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు. నమ్మి మోస పోకండి.

కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే బాధ్యత నాది. నరేందర్ రెడ్డి చెప్పిన ప్రతి పనిని నేను చేస్తా.. మీరు మాత్రం బ్యాలెట్ బాక్స్‌లో బీఆర్‌ఎస్‌కు గుద్దుడు గుద్దితే.. రేవంత్ రెడ్డి పారిపోవాలి. తెలంగాణకు ఒకే ఒక్క గొంతు నొక్కేందుకు డీల్లి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ, అమిత్‌ షా గుంపులు, గుంపులుగా వస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా నరేందర్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండని రేవంత్ రెడ్డి’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement