Wayanad Landslides: కేరళను ముందుగానే హెచ్చరించాం, కానీ: అమిత్‌ షా | Kerala Given Early Warning About Landslides Deaths: Amit Shah | Sakshi
Sakshi News home page

Wayanad Landslides: కేరళను ముందుగానే హెచ్చరించాం, కానీ: అమిత్‌ షా

Jul 31 2024 3:15 PM | Updated on Jul 31 2024 4:20 PM

Kerala Given Early Warning About Landslides Deaths: Amit Shah

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అతీతంగా కేరళ ప్రజలు, ప్రభుత్వానికి ప్రధాని మోదీ అండగా ఉంటారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై రాజ్యసభలో అమిత్‌షా మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం  జులై 23నే హెచ్చరించిందని పేర్కొన్నారు.

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందు పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించిందని, దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన కేంద్రం తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపిందని  పేర్కొన్నారు. అయితే  సకాలంలో ప్రజలను తరలించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని అన్నారు

అయితే ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం  ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల దేశాలలో భారత్‌ ఒకటని అన్నారు. ఒకవేళ ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉంటే కొండచరియలు విరిగిపడటంతో మరణాలను తగ్గించవచ్చని షా అన్నారు. 

వయనాడ్ దుర్ఘటనను ఎదుర్కొనేందుకు నరంద్ర మోదీ.. కేరళ ప్రభుత్వం, ప్రజలకు మద్దతుగా ఉన్నారని అన్నారు. మంగళవారం రాత్రి వాయనాడ్‌లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ పర్యటించారని, ప్రధాని మోదీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.కాగా కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో మంగళవారం వాయనాడ్ జిల్లాలో  కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటి వరకు 158 మందికి పైగా మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. ఇక 180 మంది గల్లంతవ్వగా వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement