పంజాబ్‌లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..! | Arvind Kejriwal Hints At Early Punjab Assembly Polls, Declares Bhagwant Mann As AAP CM Face For Next Election | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ముందస్తు ఎన్నికలు.. సీఎం అభ్యర్థి మాత్రం..!

Jun 13 2026 5:04 PM | Updated on Jun 13 2026 6:21 PM

Kejriwal hints at early Punjab Assembly polls

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయం కంటే ముందే జరిగే అవకాశం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. శుక్రవారం (జూన్‌ 12) బఠిండాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్‌... 2027 ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు 2026 నవంబర్‌లోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు.

అయితే ముందస్తు ఎన్నికలకు కారణం ఏంటనే విషయాన్ని ఆయన వివరించలేదు. అయినప్పటికీ, ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధం కావడానికి కొన్ని నెలలే మిగులుతాయని చెబుతూ పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

భగవంత్‌ మానే ఆప్‌ సీఎం అభ్యర్థి
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార‍్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మానేనని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడంపైనే పార్టీ దృష్టి ఉండాలని చెప్పారు. గత నాలుగు ఏళ్లలో పంజాబ్‌ ప్రభుత్వం చూపిన పనితీరు ప్రజల విశ్వాసాన్ని, మద్దతును సంపాదించిందని కేజ్రీవాల్‌ అన్నారు. 

ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సీనియర్‌ ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా, పంజాబ్‌ ఆప్‌ అధ్యక్షుడు అమన్‌ అరోరాతో కలిసి కేజ్రీవాల్‌ బఠిండాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బఠిండా మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆప్‌ కౌన్సిలర్లు మేయర్లుగా ఎన్నికయ్యారని, ఇది పార్టీ పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.

ప్రతిపక్షంపై కేజ్రీవాల్‌ విమర్శలు
ప్రత్యర్థి పార్టీల పేర్లు ప్రస్తావించకుండా కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పార్టీని "చిట్టా పార్టీ", మరో పార్టీని "ఫైటింగ్‌ పార్టీ", ఇంకో పార్టీని "ఈడీ పార్టీ"గా పేర్కొంటూ, మాదకద్రవ్యాల సమస్యతో సంబంధం ఉండటం, అంతర్గత కలహాలు, ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర సంస్థలను వినియోగించడం వంటి పనులు చేస్తున్నాయని ఆరోపించారు.

దీనికి భిన్నంగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టి పెట్టిన పార్టీగా ఆప్‌ను ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ పనితీరును సమర్థిస్తూ, పంజాబ్‌ ప్రజలు చూసిన అత్యంత నిజాయితీ నాయకుల్లో ఆయన ఒకరని అన్నారు. గత ప్రభుత్వాలపై అవినీతి, కుంభకోణాల ఆరోపణలు వచ్చేవని, అయితే మాన్‌ పదవీకాలంలో అలాంటి ఆరోపణలు ఏవీ రాలేదని కేజ్రీవాల్‌ చెప్పారు. ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుని ఉండేవని ఆయన వాదించారు.

పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ఉచిత విద్యుత్‌, రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ అందిస్తున్నామని చెప్పారు. అలాగే జులై నుంచి మహిళలకు ఆర్థిక సాయం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలకు రూ.1,000, షెడ్యూల్డ్‌ కులాల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement