బాబూ.. విశాఖపై ఎందుకు విషం?  | Karanam Dharmasri Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబూ.. విశాఖపై ఎందుకు విషం? 

Aug 27 2020 4:20 AM | Updated on Aug 27 2020 7:49 AM

Karanam Dharmasri Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ పార్టీ లీడరా.. లేక రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరా.. అర్థం కావడం లేదని, అమరావతి ఉద్యమం అనేది పచ్చి బూటకమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. 250 రోజుల ఉద్యమం అని చెప్పుకుంటూ పది మందిని చూపుతూ ఉద్యమం అంటున్నారని ఎద్దేవా చేశారు. తన వాళ్ల భూములు కాపాడుకోవడానికే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

► జూమ్‌ బాబు అమరావతి కబుర్లు పచ్చి బూటకం. అమరావతి ఉద్యమం పేరుతో బాబు రోజుకొక డ్రామా ఆడుతున్నారు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ అందరినీ మోసం చేస్తున్నారు. 
► విశాఖ అంటే చంద్రబాబు ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావటం లేదు. వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వైజాగ్‌ రాజధానిని 
అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారు.
► చంద్రబాబు చేయిస్తున్న జూమ్‌ ఉద్యమానికి సీపీఐ, సీపీఎం మద్దతు తెలుపుతూ కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వటం కమ్యూనిస్టు పార్టీల సిద్ధాంతం. కానీ రాష్ట్రంలో వారి తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా అని పేరు మార్చుకుంటే సరి. 
► దళితులపై ప్రేమ లేనందువల్లే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను బాబు అడ్డుకుంటున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసిన బాబు.. రమేష్‌ ఆస్పత్రి వ్యవహారంలో ఎందుకు నోరు మెదపడం లేదు? 
► మాకు అన్ని ప్రాంతాలు సమానమే. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. న్యాయస్థానాలు అంటే మాకు గౌరవం ఉంది. ఏ విషయంలోనైనా అంతిమ విజయం మాదే.  
► విశాఖ విషయంలో టీడీపీ ప్రజా ప్రతినిధులతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలి. ప్రజల మనోభావాలేంటో అప్పుడు బాబుకు అర్థం అవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement