చేతులు కట్టుకుని పరువు తీస్తావా.. చంద్రబాబు కోసం కాపు కులాన్ని వాడుకుంటావా?
సాక్షి, అమరావతి: సొంత సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ తాను మాత్రమే ఎదగాలని కోరుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కాపులు క్షమించరని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నాకొడకల్లారా.. అంటూ పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కోసం కాపు కులాన్ని వాడుకుంటావా? అని ఆయన నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వంగవీటి రంగా హత్యకు కారకుడైన చంద్రబాబు పక్కన చేతులు కట్టుకుని నిలబడి పవన్ కళ్యాణ్ కాపుల పరువు తీశారు. గతంలో జనవాణి కార్యక్రమానికి వచ్చి రంగా విగ్రహానికి కనీసం దండ వేయని పవన్ కళ్యాణ్కు కాపుల పట్ల ఏం ప్రేమ ఉంది? పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసైనికులు ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆయన మాత్రం చంద్రబాబును ఆ కుర్చీలో కూర్చోబెట్టాలనే విధంగా వ్యవహరించడాన్ని కాపు యువత గుర్తించాలి.
పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిలా వ్యవహరించటం లేదు. మూడు పెళ్లిళ్ల నినాదం ఇస్తే యువత పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోతే అంతిమంగా కాపు కులమే అవహేళనకు గురవుతుందని గుర్తించాలి. చంద్రబాబు–పవన్ డైరెక్షన్లోనే కాపులపై కుట్ర జరుగుతోం ది. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు నేతలు కాపులు కాదా? విశాఖలో మంత్రులపై దాడుల వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. 2014లో జనసేన వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనేక దుర్మార్గాలకు పాల్పడి జన్మభూమి కమిటీలతో వేధిస్తే పవన్ ఏం చేశారు? కాపు కార్పొరేషన్కు ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు 2014 – 17 చివరి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? కాపు నేతలు, యువకులపై టీడీపీ హయాంలో తప్పుడు కేసులు బనాయించిన దుష్ట శక్తులెవరో పవన్కు తెలియదా? ముద్రగడ కుటుంబాన్ని రోడ్డుకీడ్చి దూషించి మహిళలను జుత్తు పట్టుకుని కొడితే పవన్కు కాపులు గుర్తు రాలేదా? కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం కోనసీమలో అల్లర్లకు ప్రేరేపించి రాజకీయ లబ్ధి కోసం పాకులాడింది ఎవరో పవన్కు తెలియదా?’ అని అడపా శేషు అన్నారు.