సాక్షి, ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బందిపై తాను దాడి యత్నం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను.. ఎమ్మెల్యేపై దాడి చేయగలనా అని ప్రశ్నించారు. తన బైక్ను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకే ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని చెప్పారు.
అయితే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఎమ్మెల్యే, ఆయన అనుచరులే తనపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం "నేను చేసిన తప్పేంటి?" అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి తనను జైలుకు పంపించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన ఆరోపణలకు సంబంధించిన మూడు అంశాలను నిరూపించాలని వంశీ డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష ఇచ్చారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని వంశీ తెలిపారు. తన తరఫున కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఇతర కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై నియోజకవర్గంలోని జనసేన నాయకులు స్పందించాలని కోరారు. వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పోలవరం జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది.


