కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు | Gadikota Srikanth Reddy and Perni Nani comments over govt | Sakshi
Sakshi News home page

కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు

Jul 7 2024 5:38 AM | Updated on Jul 7 2024 6:22 AM

Gadikota Srikanth Reddy and Perni Nani comments over govt

మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రకటన

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, తీసు­కున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా కాలయా­పనకే తప్ప.. కార్యాచరణ లేదనే విషయం స్పష్టమ­వుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయ­పడింది. అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయం విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ స్పందనను మాజీమంత్రి పేర్ని  నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారు ఏం పేర్కొన్నారంటే..

» రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలేంటి? అపరిష్కృత అంశాలేంటి? పంచాల్సిన ఆస్తులేంటి? ఎందుకు ముందుకెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అనే వాటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్లుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.

»    పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం గతంలో  సీనియర్‌ అధికారి షీలా బేడీ కమిటీని  ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటిపై అనేక దఫాలుగా పదేళ్లపాటు చర్చలు జరి­గాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభు­త్వం అంగీకరించినప్పటికీ ఆచరణకు నోచుకో­లేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటు­చేయ­డ­మంటే వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.

» ఇక తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగు­ళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ రోజు ముఖ్య­మంత్రి స్థానంలో ఉన్న వైఎస్‌ జగన్‌ కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. 

ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటుచేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.

»  పైగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా, వారి ప్రమేయంలేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టం చేసింది పార్లమెంటు, దాన్ని అమలు­చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 

»  ఇక రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్‌ బకాయిల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా ఆ బకా­యిలు చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి పరిష్కారం సాధించే ప్రయత్నం ఇప్పుడు జరిగిన సమావేశంలో పెద్దగా జరిగినట్లు లేదు. 

»  ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెం­డుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్‌ రూపే­ణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచి­పెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణ­యాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే. 

»  ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్‌ కుడికాల్వ, స్పిల్‌వే భాగాన్ని వైఎస్సార్‌సీపీ అధి­కారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్క­రిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయ­మనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్య­మంత్రుల సమావేశంలో చంద్రబాబు దీనిపై కూడా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవ­డంతో విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

» ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరిన­ట్లుగా మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. అలాగే, ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. రాష్ట్ర­వ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందో­ళ­నలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కాని, ఒక అధికారి కాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరి­చినట్లే అవుతుందని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement