సూర్యాపేటలో బీసీ మీటింగ్‌ పెట్టనివ్వలేదు | Congress leader V Hanumantha Rao targets MP Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో బీసీ మీటింగ్‌ పెట్టనివ్వలేదు

Oct 23 2023 2:39 AM | Updated on Oct 23 2023 2:39 AM

Congress leader V Hanumantha Rao targets MP Uttam Kumar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సొంత పార్టీకి చెందిన మాజీ ఎంపీ, సీనియర్‌ నేత వి. హనుమంతరావు ధ్వజమెత్తారు. తాను అంబర్‌పేట నియో జకవర్గం నుంచే గతంలో గెలిచి మంత్రిని అయ్యానని, ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడ్డానని, తాను అక్కడ లక్ష్మణ్‌యాదవ్‌కు టికెట్‌ అడుగుతుంటే ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఆదివారం హైదరాబాద్‌లోని తన నివా సంలో విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు.

శ్రీకాంత్‌గౌడ్‌ అనే వ్యక్తి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడని, ఆయన్ని ప్రోత్సహిస్తూ తనపై ఉత్తమ్‌ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సూర్యాపేటలో బీసీ గర్జన సభ పెడతానని అంటే ఉత్తమ్‌ పెట్టనీయలేదని, ఆయనకు బీసీ ఓట్లు కావాలి కానీ, బీసీల మీటింగ్‌ వద్దా అని ప్రశ్నించారు. తన మనుషులైన మహేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డిలను పార్టీ నుంచి బయటకు పంపింది ఉత్తమేనని ఆరోపించారు.

పార్టీ మారుతున్నానని ప్రచారం చేసుకుని, బ్లాక్‌మెయిల్‌ చేసి ఉత్తమ్‌ స్క్రీనింగ్‌ కమిటీ లాంటి పదవులు తెచ్చుకున్నాడని విమర్శించారు. అంబర్‌పేట సీటు జోలికొస్తే ఉత్తమ్‌ వెంటపడుతానని హెచ్చరించారు. పార్టీ నుంచి చాలా మందిని బయటకు వెళ్లేలా చేసిన ఉత్తమ్‌ తనను కూడా పంపాలని కుట్ర పన్నుతున్నాడని, తాను గాంధీ కుటుంబానికి విధేయుడినని వీహెచ్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement