విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Why AP Needs Jagan Nov 06 Updates | Sakshi
Sakshi News home page

వై ఏపీ నీడ్స్‌ జగన్‌: ‘జరిగిన మంచిని లెక్కలతో సహా ఇంటింటికి చెప్పాలి’

Nov 6 2023 2:49 PM | Updated on Nov 6 2023 4:24 PM

CM YS Jagan Review On Why AP Needs Jagan Nov 06 Updates - Sakshi

గతానికి భిన్నంగా పరిస్థితులు ఎలా మెరుగుపడ్డాయి?. ఎంత మంచి జరిగింది?

సాక్షి, గుంటూరు: గత నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించడంతో పాటు అర్హులై ఉండి సంక్షేమ  పథకాలు అందని వాళ్ల విషయంలో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.  నవంబర్‌ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’పై అధికారులతో సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారాయన.

ఈ సమీక్షలో ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రధానంగా ప్రచారం చేయాలని అధికారుల్ని, సీఎం జగన్‌ ఆదేశించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అనే దానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలి. గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలి. ఒకవేళ అర్హులకు ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి’’.. 

..స్కూళ్లలో నాడు– నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలి. ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలి. పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో వివరించాలి. సోషల్‌ ఆడిట్‌ ద్వారా నాణ్యంగా అందుతున్న సేవల్ని వివరించాలి. దిశ యాప్‌ ద్వారా అందుతున్న సేవలు‌ తదితర అంశాలన్నింటిపైనా చెప్పాలి.  మొత్తంగా గత నాలుగున్నరేళ్లలో ఈ పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వారికి తెలియజేయాలి’’ అని అన్నారు. 

ఇది చాలా ముఖ్యమైన అంశం
ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడు ఎలా ఉన్నాం? అనే అంశాలపై మరీ ప్రజలకు వివరాలను తెలియజేయండి. డీబీటీ, నాన్‌డీబీటీ, గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించండి. జరిగిన మంచిపై ఆధారాలు చూపించండి. మరీ ముఖ్యంగా.. ఈ ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్ని వివరించండి. సంక్షేమ పథకాల అవగాహన కల్పించడంతో పాటు ఆ పథకాలను ఏరకంగా వాడుకోవాలనేది తెలియజేయండి. 

ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బోర్డులు పెట్టి.. ఏయే పథకంద్వారా ఎంతమందికి లబ్ధి పొందిదన్నదీ ఆ బోర్డుల ద్వారా వివరించండి. డీబీటీ ఎంత? నాన్‌ డీబీటీ ఎంతో వివరాల్ని పొందుపరచండి. నాడు – నేడు ద్వారా చేసిన ఖర్చు.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌  క్లినిక్స్‌ కోసం ఎంత ఖర్చు చేశామో తెలియజేయండి. అలాగే గడపగడపకూ మన ప్రభుత్వం ద్వారా గుర్తించిన ప్రాధాన్యతా కార్యక్రమాలకోసం చేసిన ఖర్చును వివరించండి. 

ఇక అర్బన్‌ ఏరియాలో కూడా సచివాలయం ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులతో సీఎం జగన్‌ అన్నారు. ‘‘గతానికి భిన్నంగా పరిస్థితులు ఎలా మెరుగుపడ్డాయి?. ఎంత మంచి జరిగింది? అనేదాన్ని ప్రతి ఇంటికీ తీసుకుని పోవాలి. ఏది ఏమైనా నవంబర్ 9న ఈ కార్యక్రమం మొదలు కావాలి’’ అని అధికారులతో సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

గత నాలుగున్నరేళ్లలో ప్రజలకు జరిగిన మంచిని, రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తూ మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రచారంతో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం తెరపైకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement