
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 13 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల, వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్న(బుధవారం) సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు పెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఏ తప్పూ చేయని వారిపై చేయిచేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను రెండు గ్రూపులుగా చేసిన పోలీసులు.. 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు మరో నలుగురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు.