
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గులాబీ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై తాజాగా జగదీష్ రెడ్డి స్పందిస్తూ..‘నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కొంత మంది ఏదో చేసేదామని అనుకుంటున్నారు. వ్యక్తులుగా ఏదో చేస్తామనుకుంటే అది వాళ్ల భ్రమ. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చావు తప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచాను. కొంత మంది అది కూడా గెలవలేదు కదా. పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ గొప్పది. నల్లగొండలో అంతకుముందు ఎక్కువ సీట్లు వచ్చాయి.. అప్పుడు నేనే కారణం అన్నారు.. ఇప్పుడు ఒక్కడినే గెలిచాను.. అందుకే దీనికి కూడా నేనే కారణం. బనకచర్ల, కాళేశ్వరంపై కేసీఆర్తో చర్చించాం. కేసీఆర్తో చర్చల్లో కవిత విషయమే ప్రస్తావనకు రాలేదు. కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు...
కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణ లు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న....— Jagadish Reddy G (@jagadishBRS) August 3, 2025
అంతకుముందు.. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి కవిత సంచలన ఆరోపణలు చేశారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. దీంతో, కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా పెను దుమారం రేపాయి.