
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీకే చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే టైమ్ పాస్ మీటింగ్ లతో అలసిపోయామని, తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని త్వరగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, రేపు( ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కులగణనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్యనీయాంశంగా మారాయి.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గత నెలలో రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో రాజాసింగ్ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటూనే , రాష్ట్రంలోని నాయకత్వం సరిగా లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు.
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ గౌతంరావును అభ్యర్థిత్వాన్ని తొలుత నిరాకరించారు రాజాసింగ్. అయితే కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ చొరవతో రాజాసింగ్ కాస్త దిగివచ్చారు. పార్టీ లైన్ లోనే పనిచేస్తానని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. అయితే మరొకసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటో కీలక నేతలకు అర్థం కావడం లేదు.