జవాన్లను అవమానిస్తారా..!? | Bandi Sanjay Kumar Comments On KCR Over Phone tapping | Sakshi
Sakshi News home page

జవాన్లను అవమానిస్తారా..!?

May 12 2024 4:27 AM | Updated on May 12 2024 4:27 AM

Bandi Sanjay Kumar Comments On KCR Over Phone tapping

ఫోన్‌ ట్యాపింగ్‌లో అడ్డంగా దొరికిన కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు 

నేను ఓడిపోతే కాషాయం జెండా పట్టను.. హిందుత్వం గురించి మాట్లాడను 

సిరిసిల్ల బైక్‌ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌

సిరిసిల్ల/కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌లో ముస్లిములంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్‌ అన్నారని, ‘నేను హిందువుల ఓటు బ్యాంకుతో బంపర్‌ మెజార్టీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోతే పార్టీ దుకాణం బంద్‌ చేస్తావా? మగాడివైతే, హిందువైతే నీ శరీరంలో మందు కాకుండా రక్తమే ప్రవహిస్తే నా సవాల్‌ను స్వీకరించాలని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

దేశ రక్షణ కోసం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసిన జవాన్లను అవమానించిన కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బీజేపీ శ్రేణులతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గాం«దీచౌక్‌లో ఆయన మాట్లాడుతూ..సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను సమర్థించే వారంతా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్నారు. గాడిద గుడ్డూ పెట్టదు..కాంగ్రెస్‌ 6 గ్యారంటీలు అమలూ చేయదని విమర్శించారు. 

కాంగ్రెస్‌ వాళ్లు సర్వనాశనం చేసేస్తారు 
మోదీ ప్రధాని కాకపోతే కాంగ్రెస్‌ వాళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 12ఎంపీ సీట్లు గెలవబోతోందని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో సంజయ్‌కు మద్దతుగా ‘మహా బైక్‌ ర్యాలీ’నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్‌ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారని, అలాంటి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమారెడ్డి, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement