
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి సీదిరి అప్పలరాజు చరిత్ర సృష్టించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను మంత్రిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.సమర్థమైన పనితీరు, చక్కటి వాగ్ధాటి ఆయనకు కలిసొచ్చాయి. పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యత సంతరించకుంది.
అంతా అనూహ్యమే
సీదిరి రాజకీయ ప్రవేశమే అనుహ్యం. వైద్యవృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్న నేతల పునాదులు కదిల్చారు. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల అధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీ సాధించారు.
నేపథ్యం..
పేరు: డాక్టర్ సీదిరి అప్పలరాజు
నియోజకవర్గం: పలాస
స్వస్థలం: దేవునల్తాడ
తల్లిదండ్రులు: దాలమ్మ, నీలయ్య (లేటు)
పుట్టినతేదీ: ఫిబ్రవరి 22, 1980
విద్యార్హతలు: ఎండీ జనరల్, ఎంఈడీ
సతీమణి: శ్రీదేవి
సంతానం: కుమారులు ఆర్నవ్ వర్మ, ఆరవ్ వర్మ
జిల్లా: శ్రీకాకుళం
రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి చిన్నవయసులో 26 ఏళ్లకే విశాఖపట్నం లోని కేజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 2007 డిసెంబర్ 14న పలాస–కాశీబుగ్గ పట్టణంలో సేఫ్ హాస్పిటల్ స్థాపించి వైద్యుడిగా కొనసాగుతూ దాదాపు 12 సంవత్సరాల పాటు వైద్యునిగా సేవలు అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు 2017 ఏప్రిల్ 19న వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబంపై విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 22, 2020న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు.
చదవండి: (Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక)