YSRCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల | Sakshi
Sakshi News home page

YSRCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల

Published Sat, Apr 27 2024 3:48 PM

AP Elections: CM YS Jagan Release YSRCP Manifesto 2024 Full Details

వైఎస్సార్‌సీపీ 2024 మేనిఫెస్టో విడుదల

తొమ్మిది ప్రధాన హామీలతో సంక్షేమ పథకాల కొనసాగింపు

పాత పథకాల కొనసాగింపు.. విస్తరణ

పెన్షన్లు సహా కొన్ని పథకాలకు దఫ దఫాలుగా లబ్ధి పెంపు

మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం

చేసేదే చెప్తాం.. చెప్పింది చేశాం కాబట్టే హీరోలా ప్రజల్లోకి వెళ్తున్నాం

చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు

సంపద దృష్టి, పన్నుల భారం, అప్పుల విషయంలోనూ చంద్రబాబు అబద్ధాలు

ఇదే కూటమి 2014లో ఏపీ ప్రజలను మోసం చేసింది

రెండు పేజీలతో కూడిన వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో

చేయగలిగిందే చెబుతాం.. మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఏమాత్రం అవకాశం ఉన్నా అదనంగా చేస్తాం : సీఎం జగన్‌

విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో

 

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్‌ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారాయన.

 

మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ, మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రొగ్రెస్‌ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్‌ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం.

 కానీ, 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం. 2014లోనూ నాకు బాగా గుర్తుంది. ఆనాడు కూడా చేయగలిగిందే చెప్పాం. అమలు చేసినా, చేయకున్నా.. చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని చాలామంది నా మంచి కోసమంటూ చెప్పారు. కానీ, నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా. ఇదీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలి. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. లీడర్‌షిప్‌ అంటే చెప్పిన ప్రతీ మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమే. 

నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం.  చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశా. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశా. పేదలకు సంక్షేమం అందించాం. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం అందించాం. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడమూ ఎప్పుడూ జరగలేదు. 

ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసింది. రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీని ఎగ్గొట్టారు. సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ నగరంలోనూ హైటెక్‌ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారు.  కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు. సాధ్యంకాని హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా? విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు?. రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం  ఉండాలి.

 మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు అవుతోంది. సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం. చట్టం అమలు చేసి 50 శాతం రిజర్వేషన్లతో నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. 

YSRCP మేనిఫెస్టో కాపీ కోసం క్లిక్‌ చేయండి

బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులిచ్చాం. 60 శాతం మంత్రి పదవులు  పేద విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసి చూపించాం.  పంటల కొనుగోలులో దళారుల వ్యవస్థ లేకుండా చేశాం. 

మేం ఇచ్చిన హామీలను ఎంతో నిష్టగా అమలు చేశాం. ఎక్కడా లంచాల ప్రస్తావన లేకుండా డీబీటీ ద్వారా సంక్షేమం అందించాం.  2014-19 మధ్య 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.  గత 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.

ఆరోగ్యశ్రీ,  సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్‌మెంట్‌, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదు. జగన్‌ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయి. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదు. చంద్రబాబు చెబుతున్న పథకాలను లక్షా 21 వేల కోట్ల రూపాయలు అవసరం. మనం  అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి 29 వేల 100 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అంటే.. చంద్రబాబు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ 10 హామీలకు మన సంక్షేమ పథకాల కలిపి అమలు అమలు చేయాలంటే కచ్చితంగా అక్షరాల లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం?.. 

  • మాట్లాడితే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో సంపద సృష్టిని పరిశీలిస్తే.. ప్రతీ ఏడాదిలోనూ రెవెన్యూ లోటే కనిపించింది. మరి ఎక్కడ సృష్టించారు? తాను సంపద సృష్టించానని చంద్రబాబు సిగ్గు లేకుండా ఎలా చెప్పుకుంటున్నారు? అని సీఎం జగన్‌ నిలదీశారు. సమర్థవంతమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. 

  • 2014-19 చంద్రబాబు పాలనలో అప్పులు భారీగా పెరిగాయి. చంద్రబాబు హయాంలో అప్పులు  21.8 శాతం పెరిగాయి. మా పాలనలో అప్పులు కేవలం 12.13 శాతానికి పరిమితమైంది. 

  • రెండేళ్లలో కోవిడ్‌ పరిస్థితులతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు హయాంలో 4.47 శాతం జీఎస్ డీపీ ఉంటే మన హయాంలో 4.83 శాతం జీఎస్ డీపీ ఉంది

  • ట్యాక్స్‌లు వేసి బాదేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అది కూడా చూద్దాం. చంద్రబాబు హయాంలో పన్నుల భారం 6.57 శాతం అయితే జగన్‌ హయాంలో 6.35 శాతం. అన్నింటికీ లెక్కలు ఉన్నాయి. 

  • జగన్‌ ఎప్పుడు అబద్ధాలు ఆడడు. జగన్‌ ఎప్పుడూ మోసం చేయడు. పేదలను ప్రేమించి, అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా.. పెట్టకపోయినా జగన్‌ వేసిన అడుగులు రాష్ట్రంలో ఎవరూ వేయలేరు. అవకాశం, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా జగన్‌ పేదవాళ్ల కోసం అడుగులు వేస్తాడు. పేదవాళ్లు మంచి చేసే విషయంలో జగన్‌కు ఉన్న ప్రేమ మరెవరికీ ఉండదు.. ఉండబోదు. జగన్‌కు మనసు ఉంది. కల్మషం లేదు. పెన్షన్‌ల విషయంలో అవ్వాతాతల మీద చూపించిన ప్రేమ చరిత్రలో ఎవరూ చూపించలేదు.

  • YSRCP మేనిఫెస్టో విడుదల.. ముఖ్యమైన అంశాలు.. 

  • రెండు పేజీలతో కూడిన YSRCP మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణ.. 9 ముఖ్యమైన హామీలతో కూడిన వైఎస్సార్‌సీపీ 2024 మేనిఫెస్టో చదివి వినిపించారాయన.

  • రెండు విడతల్లో పెన్షన్‌  రూ.3,500 దాకా పెంపు(2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతాం)
    66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ తప్ప మరొకటి లేదు.

  • అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు

  •  వైఎస్సార్‌ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు

  • అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం

  • రాబోయే ఐదేళ్లలో వైద్యంపై స్పెషల్‌ ఫోకస్‌. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ(ఆరోగ్యశ్రీ పరిధిని ఇదివరకే రూ.25 లక్షలకు విస్తరించాం)

  • వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కొనసాగింపు.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు

  • నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు

  • వైస్సార్‌ రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు

  • మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందజేత

  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం

  • ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేలు

  • వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతాం

  • లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా

  • చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు

  • వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు

  • లా నేస్తం కొనసాగింపు

  • అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు

  • నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌

  • ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ.. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ

  • స్విగ్గీ, జొమాటో లాంటి గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా వర్తింపు

  • ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌

  • వీటితో పాటు.. వివిధ వర్గాలకు కొనసాగిస్తున్న సంక్షేమం గురించి మేనిఫెస్టోలో ప్రస్తావన

  • రాజధానుల విషయంలో

  • మళ్లీ అధికారంలోకి రాగానే.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తాం

  • రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతాం

  • అమరావతిని శాసన రాజధానిగా అభివృ‍ద్ధి చేస్తాం

  • కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం

  • భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తాం

  • మొత్తంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉంది.
     


 

Advertisement
Advertisement